అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Mock Parliament | ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ.. మహిళా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో (Nizamabad Collectorate) శనివారం నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ ఉత్సాహంగా సాగింది. బాలికలు పార్లమెంట్లో లాగా ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించిన తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ప్రసంశలు కురిపించారు.
Mock Parliament | రెండు గంటలకు పైగా మాక్ పార్లమెంట్..
కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటి స్పీకర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మహిళా సాధికారత (Women Empowerment), బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన బాలికలు ప్రశ్నించగా.. సంబంధిత శాఖల మంత్రుల పాత్రను పోషించిన బాలికలు సమాధానాలు చెప్పారు. దాదాపు రెండు గంటలకు పైగా మాక్ పార్లమెంట్ సెషన్ అద్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల పాత్రలో బాలికలు ఎంతో చక్కగా ఇమిడిపోయి రాణించడంపై కలెక్టర్ వారిని అభినందిస్తూ తన తరపున పలువురికి ప్రత్యేక బహుమతులు అందించి ప్రోత్సహించారు.
Mock Parliament | అత్మవిశ్వాసంతో ముందుడుగు వేయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, సముచిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కలెక్టర్ పేర్కొన్నారు. తాము ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమంగా బాలికలు రాణించి మాక్ పార్లమెంట్ను విజయవంతం చేశారని ప్రశంసించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ (Girls Leadership), ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని హితవు పలికారు.
Mock Parliament | ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని..
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, స్మార్ట్ ఫోన్లలో అనవసర విషయాలకు సమయం వృథా చేయకూడదని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యాల పరిరక్షణ కోసం తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే నిస్సంకోచంగా అధికారుల దృష్టికి తేవాలని, భద్రతా పరమైన సమస్యలు ఎదురైనప్పుడు భరోసా కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు.
Mock Parliament | పిల్లలను తల్లిదండ్రులు సమదృష్టితో పెంచాలి
తల్లిదండ్రులు పిల్లలను సమ దృష్టితో పెంచాలని, బాలికలపై వివక్షను ప్రదర్శించకూడదని కలెక్టర్ హితవు పలికారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కేరళంలో అక్షరాస్యత 90 శాతానికి పైగా ఉందని, అదే స్పూర్తితో తెలంగాణాలో కూడా అక్షరాస్యతను గణనీయంగా వృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తాము గమనించిన పలు సమస్యలు, ఇబ్బందుల గురించి బాలికలు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరపున తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న, డీఈవో అశోక్, డీఎంహెచ్వో రాజశ్రీ, జిలా సంక్షేమ అధికారిణి పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్



