అక్షరటుడే, కామారెడ్డి: Police Assistance | అర్ధరాత్రి చీకటిలో, దారితప్పిన ఓ తల్లి ఆర్తనాదం డయల్-100 ద్వారా సదాశివనగర్ (Sadashivanagar Police) పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన వారు ఆమెకు సపర్యలు చేసి గమ్యస్థానానికి చేర్చారు.
Police Assistance | ఆరోగ్య కేంద్రానికి తరలింపు
మండలంలోని ధర్మారావుపేట గ్రామ వీధుల్లో మతిస్థిమితం సరిగా లేని సుమారు 60 ఏళ్ల వృద్ధురాలు(Woman Rescue) అయోమయంగా తిరుగుతున్నదన్న సమాచారం పోలీసులకు అందింది. నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఇసాక్, రంజిత్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఇది కేవలం ఒక ఫిర్యాదు కాకుండా.. ఓ తల్లి ఆపదలో ఉందని గ్రహించిన వారు వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకుని గాలించగా, ముఖంపై గాయాలతో, భయంతో వణికిపోతూ కనిపించింది ఆ తల్లి. ఆమెను సదాశివనగర్ గ్రామానికి చెందిన కుర్ర సావిత్రిగా పోలీసులు గుర్తించారు. గాయాలతో ఉన్న వృద్ధురాలిని వెంటనే దగ్గరకు తీసుకుని, ఓదార్చి.. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Police Assistance | చికిత్స చేయించి..ధైర్యం చెప్పి..
స్వయంగా దగ్గరుండి చికిత్స చేయించి, ఆమెకు ధైర్యం చెప్పారు. బాధ్యత అక్కడితో తీరిపోలేదని భావించిన ఆ పోలీసులు, సావిత్రి బంధువుల ఆచూకీ కోసం ఆరా తీశారు. ఎట్టకేలకు వారిని సంప్రదించి, పూర్తి వివరాలు చెప్పి, ఆమెను సురక్షితంగా వారి చెంతకు చేర్చారు. అర్ధరాత్రి వేళ, గాయాలతో, మాట సాయం చేసే దిక్కులేక ఒంటరిగా మిగిలిన ఆ వృద్ధురాలికి పోలీసులే కొడుకులై నిలిచారు.
