అక్షరటుడే వెబ్డెస్క్: India Oil Reserves | దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరతా లేదని, ప్రస్తుతం మన వద్ద 76 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ( Hardeep Singh Puri ) స్పష్టం చేశారు. సోమవారం ఒక జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ ఇంధన భద్రత, ధరల నియంత్రణపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
India Oil Reserves | భవిష్యత్తు అంతా ‘గ్రీన్ హైడ్రోజన్’దే..
‘గ్రీన్ హైడ్రోజన్’ను భవిష్యత్ ఇంధనంగా మంత్రి అభివర్ణించారు. రాబోయే రోజుల్లో దేశంలో దీని వినియోగం పెరగడం ద్వారా ఇంధన ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో 2022తో పాటు ఇటీవల 2026 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాలు తలెత్తినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ దౌత్య నీతి కారణంగా దేశీయ వినియోగదారులపై ఆ ప్రభావం పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.

India Oil Reserves | 41 దేశాల నుంచి దిగుమతి..
చమురు కోసం భారత్ కేవలం ఒకే దేశంపై ఆధారపడటం లేదని, ఏకంగా 41 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని మంత్రి తెలిపారు. మన దేశానికి వచ్చే క్రూడాయిల్లో 90 శాతం, ఎల్పీజీ (LPG)లో 60 శాతం ‘హార్ముజ్ జలసంధి’ మార్గం గుండానే వస్తుందని చెప్పారు. అక్కడ అంతర్జాతీయంగా సమస్యలు తలెత్తి బ్యారెల్ ధర 105 డాలర్లకు చేరినప్పటికీ, దేశంలో ధరలు పెరగకుండా నియంత్రించగలిగామని పేర్కొన్నారు.
India Oil Reserves | పన్నులు తగ్గించని విపక్షాలు..
ఇంధన ధరలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే స్థానిక పన్నులు (State Taxes) ఎక్కువగా ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గిస్తారనే ప్రచారంలో నిజం లేదని.. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలోనూ ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నా, భారత్ మాత్రం ఇంధన రంగంలో పూర్తి ధీమాతో ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Monsoon Arrival | చల్లని కబురు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..
