Mango Poisoning Deaths | ప్రాణాలు తీస్తున్న ‘కల్తీ’.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mango Poisoning Deaths | దేశంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతిదానిని కల్తీ చేస్తోంది. ఆహార పదార్థాల నుంచి మొదలు పెడితే పండ్లు, పాలు వేటిని వదలడం లేదు. వీటిని తింటున్న ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మామిడి పండ్లు (Mangoes) తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మామిడి పండ్లు తిన్న తర్వాత భువనేశ్వరి (17), సంధ్య (10) అనే అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీదర్​కు చెందిన వైజినాథ్, ఇందుమతి కర్ణాటకలోని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. వీరికి నలుగురు కూతుర్లు ఉన్నారు. వారు ఆదివారం నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఆ పండ్లను నలుగురు కుమార్తెలు, తల్లి ఇందుమతి తిన్నారు. అదే రోజు వారు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Mango Poisoning Deaths | చికిత్స పొందుతూ..

ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వరి సోమవారం మృతి చెందింది. మంగళవారం సంధ్య చనిపోయింది. మిగిలిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మామిడి పండ్లకు వాడిన రసాయనాల వల్ల వారు మరణించారా లేక మరేదైనా కారణం ఉందా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.

Mango Poisoning Deaths | రసాయనాలతో..

ప్రస్తుతం మార్కెట్ వివిధ రకాల మామిడి లభిస్తున్నాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుంది. ఆ పండ్లను రసాయనాలతో మగ్గిస్తున్నారు. అంతేగాకుండా పాడుకాకుండా పలు రకాల మందులు స్ప్రే చేస్తున్నారు. వాటిని తింటున్న ప్రజలు అనారోగ్యం బారీన పడుతున్నారు. కల్తీ మాఫియాతో ఆహారం అనుకుని మనం ఎక్కువగా విషాన్నే తింటున్నాం. ఇది స్లో పాయిజన్​లా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

ఇది కూడా చదవండి..:  Hyderabad Rain Traffic | ఫ్యూచర్​ సిటీ వెంపర్లాట.. ఉన్న సిటీ ఊగిసలాట.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *