అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Bunk Bulk Purchases | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది.
పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు రిటైల్ ఫ్యూయల్ స్టేషన్ల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తమ అవసరాలను బల్క్ సరఫరా మార్గాల ద్వారా ఇంధనం కొనుగోలు చేయాలని సూచించింది. సాధారణంగా డీజిల్ ధరతో పోలిస్తే బల్క్ బంకుల్లో ధర అధికంగా ఉంటుంది. దీంతో బల్క్ వినియోగదారులు తక్కువ ధరల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్లెట్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.
Petrol Bunk Bulk Purchases | అమ్మకాలు పెరగడంతో..
బల్క్ కొనుగోళ్లతో సాధారణ బంకుల్లో అమ్మకాలు భారీగా పెరిగినట్లు అధికారులు గమనించారు. దీంతో 90 రోజుల వరకు పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లు నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ (Delhi)లోని రిటైల్ పంపుల వద్ద విక్రయించే డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 95.20 కాగా, బల్క్ డీజిల్ ధర లీటరుకు దాదాపు రూ. 134.50గా ఉంది. ఈ ధరల వ్యత్యాసంతో కొన్ని పరిశ్రమలు, సంస్థలు బల్క్ సరఫరా వ్యవస్థను ఉపయోగించకుండా, పెట్రోల్ పంపుల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.
Petrol Bunk Bulk Purchases | వారికి ఇబ్బందులు లేవు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు. వ్యక్తిగత వాహన యజమానులకు పెట్రోల్ పంపుల వద్ద తగినంత సరఫరా కొనసాగేలా చూడటానికి, సాధారణ ప్రజల కోసం ఉద్దేశించిన ఇంధనాన్ని బల్క్ వినియోగదారులు దారి మళ్లించకుండా నిరోధించడానికి ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్, అనధికారిక కొనుగోళ్లు, ఇంధనాన్ని దారి మళ్లించడం వంటి ఇతర సంబంధిత అవకతవకలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలను ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Raghava Lawrence Politics | రాఘవ లారెన్స్ ‘పొలిటికల్’ ఎంట్రీ.. ప్రజల నిర్ణయమే కీలకం
