అక్షరటుడే, వెబ్డెస్క్: Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్లో సమాచారం మొత్తం ఇచ్చానని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదన్నారు.
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా.. ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోందన్నారు. అయితే తాను ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. అడిగిన సమాచారం ఇచ్చినా నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Meenakshi Natarajan Nomination | నోటీస్ మాత్రమే..
అఫిడవిట్లో కొన్ని వివరాలను నమోదు చేయలేదని, వాస్తవాలను దాచిపెట్టానని తన నామినేషన్ తిరస్కరించారని ఆమె చెప్పారు. అయితే ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నా లేదా శిక్షార్హమైన నేరంలో ఎవరైనా దోషిగా తేలినా ఆ సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. అయితే తనపై ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆ కాలమ్లో ‘వర్తించదు’ (Not Applicable) అని రాశానని చెప్పుకొచ్చారు. తనపై ఉన్నది కేవలం ఒక చట్టపరమైన నోటీసు మాత్రమేనని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన మెమోరాండంలో పొందుపరిచినట్లు వెల్లడించారు.
Meenakshi Natarajan Nomination | నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నిరసన

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను కుట్రపూరితంగా తిరస్కరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి..: Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లకు బ్రేక్
