అక్షరటుడే వెబ్డెస్క్: E-Cabinet Telangana | పరిపాలనలో వేగాన్ని, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ‘ఈ-క్యాబినెట్’ పద్ధతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో మంత్రుల భేటీలను కాగిత రహితంగా (Paper-less) మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
E-Cabinet Telangana | ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన..
సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ-క్యాబినెట్ విధానాన్ని పరిశీలించి, మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ ఇన్ కార్పొరేటెడ్ (NICSI) తో చర్చలు జరిపి, ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు టీడీటీఎస్ (TDTS) ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ప్రాజెక్టు ప్రారంభానికి తొలి విడతగా రూ.20 లక్షల నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.

E-Cabinet Telangana | మంత్రులకు ట్యాబ్లు..
ఈ విధానంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లు లేదా కంప్యూటర్లను అందిస్తారు. క్యాబినెట్ ఎజెండాలు, ఫైళ్లు, ప్రతిపాదనలు , ప్రభుత్వ నిర్ణయాలన్నీ డిజిటల్ రూపంలోనే ఉంటాయి. మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా సరే క్యాబినెట్ ఎజెండాలను పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల సమావేశాలకు ముందు , తర్వాత ఫైళ్ల నిర్వహణ సులభతరం అవుతుంది.
E-Cabinet Telangana | అత్యున్నత భద్రతా ప్రమాణాలు..
ప్రభుత్వ నిర్ణయాలు అత్యంత రహస్యమైనవి కాబట్టి, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. సమాచారం లీక్ అవ్వకుండా, సాఫ్ట్వేర్ హ్యాక్ కాకుండా ప్రతి మంత్రికీ ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను కేటాయిస్తారు. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఇది కూడా చదవండి: Diesel Theft from Train | ఆగి ఉన్న రైలులో డీజిల్ చోరీ