అక్షరటుడే వెబ్డెస్క్: RTC Fitment 2021 | ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఆర్పీఎస్-2021 కింద 11 శాతం ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఆర్టీసీ ప్రగతిపై సమీక్షించారు.
RTC Fitment 2021 | ఉద్యోగుల సంక్షేమం..
మంత్రి పొన్నం ప్రభాకర్ మానవీయ కోణంలో స్పందిస్తూ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రమాద బీమా కింద 11 కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున సాయం అందించినట్లు గుర్తుచేశారు.
RTC Fitment 2021 | ఆర్టీసీ పురోగతి..
గడచిన 30 నెలల్లో ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకుందని మంత్రి తెలిపారు. రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ ద్వారా 1,137 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పీఎఫ్, సీఎస్ఎస్ వంటి పాత బకాయిలు గణనీయంగా తగ్గాయి. తొలగించిన 490 మంది ఉద్యోగుల్లో 244 మందిని ఇప్పటికే విధుల్లోకి తీసుకున్నామని, మిగిలిన వారి కేసులను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
RTC Fitment 2021 | కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్నగర్, వేములవాడ, కోదాడ, హుజూర్నగర్ వంటి ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్ల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపనలు జరగనున్నాయి. అలాగే రాష్ట్రంలో నడుస్తున్న 1,050 ఎలక్ట్రిక్ బస్సులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
RTC Fitment 2021 | భవిష్యత్తు కార్యాచరణ..
త్వరలోనే దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో ఈవీ విధానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Mini Countryman C | స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో.. బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం కారు లాంచ్