అక్షరటుడే, వెబ్డెస్క్: ABVP Telangana School Bandh | తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ – కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందంటూ ఏబీవీపీ ఆరోపించింది.
ABVP Telangana School Bandh | ఆర్థిక దోపిడీ
సర్కారు వైఖరిని నిరసిస్తూ జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పేర్కొంది. “ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం” అనే నినాదంతో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది.
ABVP Telangana School Bandh | పలు డిమాండ్లు
ఈ బంద్ సందర్భంగా విద్యార్థి సంఘం ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లు ఉంచింది.
పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 23,000 స్కూళ్లను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి.
ఫీజుల నియంత్రణ చట్టం: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి, పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి.
విద్యా హక్కు చట్టం అమలు: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన 25% సీట్ల విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.
ఉద్యోగాల భర్తీ: ఖాళీగా ఉన్న MEO, DEO పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
మౌలిక వసతులు, యూనిఫామ్స్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ వెంటనే పంపిణీ చేయాలి.
గురుకుల పాఠశాలల ఆధునికీకరణ: గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి. ఫుడ్ పాయిజన్కు తావులేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి.
NEP 2020 అమలు: నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020) ను రాష్ట్రంలో అమలు చేయాలి.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో “బ్రేక్ ఫాస్ట్” స్కీమ్ను తక్షణమే పునఃప్రారంభించి అమలు చేయాలి.
వ్యాపారాల నివారణ: ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్, యూనిఫామ్స్ విక్రయాలను పూర్తిగా నిషేధించాలి.
ప్రభుత్వ విద్యావ్యవస్థను రక్షించుకోవడానికి, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ను విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు జయప్రదం చేయాలని ఏబీవీపీ తెలంగాణ పిలుపునిచ్చింది.