అక్షరటుడే, వెబ్డెస్క్ : Teacher Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం డీఈవోలు (DEO), హెచ్వోడీ (HOD)లకు ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి ఒకే స్థానంలో మూడేళ్లు విధులు నిర్వహించిన వారు బదిలీలకు అర్హులు. 2025 డిసెంబర్ 31 నాటికి నాలుగేళ్లు పూర్తయిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడే కొనసాగించరాదు. 2027 మే 31లోపు ఉద్యోగ విరమణ చేయనున్న వ్యక్తులు 4 సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ బదిలీ నుంచి ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఏ కేడర్లోనైనా ఉద్యోగులలో 40 శాతానికి మించి బదిలీ చేయొద్దని ఆదేశించింది.
Teacher Transfers | ఆన్లైన్లో..
జీవోలో జారీ చేసిన సూచనల ప్రకారం రాష్ట్ర, మల్టీజోనల్ (Multi Zone), జోనల్, జిల్లా కేడర్ ఉద్యోగుల బదిలీలను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. డీఈవోలు, వరంగల్, హైదరాబాద్ ఆర్ఎఫ్డిఎస్ఇ హెచ్వోడీలు ఉద్యోగుల వివరాలను పంపించాలని ఆదేశించింది. కేడర్ల వారీగా పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు, 3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, అర్హత పొందిన వారు, 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, తప్పనిసరిగా బదిలీ కావలసిన వ్యక్తుల జాబితా పంపాలని సూచించింది.

Teacher Transfers | దరఖాస్తు చేసుకోవాలి
తమ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది అందరి దృష్టికి మార్గదర్శకాలను తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన అభ్యర్థులు మే 8 నుంచి 15 వరకు బదిలీల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల ప్రక్రియ అంతా సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశించింది.
దీనిని కూడా చదవండి : Free Sewing Machines | మహిళలకు గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

