అక్షరటుడే, వెబ్డెస్క్ : Prajavani grievance | ప్రజవాణి ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా భవన్లో ప్రతి మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ప్రజావాణి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ (Hyderabad)కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Prajavani grievance | ఆర్డీవో కార్యాలయాల్లో..
రెవెన్యూ డివిజన్ స్థాయి (RDO)లో ప్రజావాణి ప్రారంభించాలని సీఎం చెప్పారు. తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు.
Prajavani grievance | రియల్ టైమ్ మానిటరింగ్
ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫాం అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలన్నారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలన్నారు.

దీనిని కూడా చదవండి : Free Sewing Machines | మహిళలకు గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

