అక్షరటుడే, కామారెడ్డి: Census India 2027 | జనగణన ప్రక్రియ దేశానికి ఎంతో కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఓరియంటేషన్ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ తన వివరాలను సెన్సెస్లో నమోదు చేయించారు.
Census India 2027 | వివరాలు నమోదు చేసుకోవాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగతంగా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నానని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలని సూచించారు. ఈ సెన్సెస్ కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదని, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని స్పష్టం చేశారు.
Census India 2027 | పారదర్శకంగా ప్రక్రియ
ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సెస్లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Free Sewing Machines | మహిళలకు గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

