అక్షరటుడే, వెబ్డెస్క్ : Sadabainama Applications | రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. సోమవారం రెవెన్యూ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు వెల్లడించారు.
భూ భారతి (Bhu Bharati) చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు వివరించగా, అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Sadabainama Applications | సాదాబైనామాల్లో వేగం పెంచాలి
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తులను పరిష్కారించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
దీనిని కూడా చదవండి : Nalgonda Tragedy | ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి