అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fake Seeds | ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు.
Fake Seeds | ఖరీఫ్ పంట సాగులో..
ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సుదర్శన్రెడ్డి అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు(Agriculture Department) నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదు అన్న సంకల్పంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: రేపు #NBK112 పూజా కార్యక్రమం