అక్షరటుడే, తాడ్వాయి: Tadwai Protest | మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్(Urea App) రద్దు కోసం బీఆర్ఎస్ భారీ ధర్నాకు పిలుపునివ్వడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.
Tadwai Protest | ధర్నాకు పర్మిషన్ లేదని..
ధర్నాకు పర్మిషన్ లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా జరగకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం పోలీసులు(Tadwai Police) వెతుకుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, వ్యవసాయ పొలాల వద్ద నాయకుల కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాకు వస్తున్నారని తెలియడంతో పోలీసులు మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు. తాడ్వాయికి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Tadwai Protest | ప్రశాంత్రెడ్డి, జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల కేంద్రాన్ని పూర్తిగా పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని అక్కడి నుంచి పంపించేయడంతో తాడ్వాయిలో ఏం జరుగుతుందో తెలియక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా తాడ్వాయిలో రైతు ధర్నాకు వెళ్లకుండా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని (Vemula Prashanth Reddy) హైదరాబాదులోని (Hyderabad) ఆయన నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లవద్దని ఆదేశాలున్నాయని పోలీసులు చెప్పడంతో ఆదేశాలు చూపించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. ‘కామారెడ్డిలో రైతుల కోసం ధర్నాకు వెళ్తే హైదరాబాద్లో అరెస్ట్ చేయడమేంటి..? రైతుల కోసం వెళ్తే ప్రభుత్వం ఇంతలా భయపడితే ఎలా? కామారెడ్డిలో అరెస్ట్ చేస్తే ఏదైనా అర్థం ఉంటుంది. ఇక్కడ అరెస్ట్ చేయడం ఏమిటి’ అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను కూడా హైదరాబాదులో హౌస్ అరెస్ట్ చేసి, తాడ్వాయికి వెళ్లకుండా ఇంటి ముందు పోలీసులను మోహరించారు.

ఇది కూడా చదవండి: నారా వారి ఇంట వారసుడు..