అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Gen Z Protests | రాజకీయ మార్పును తీసుకురాగల శక్తి యువతలో ఎంత బలంగా ఉంటుందో మరోసారి నేపాల్ నిరూపిస్తోంది. అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై గతంలో వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ మార్పునకు కారణమైన జెన్-జీ యువత.. ఇప్పుడు అదే ఆవేశంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
Nepal Gen Z Protests | భూస్వాధీనం..బలవంతపు ఖాళీ
రాజధాని ఖాట్మండులో భూస్వాధీనం, నిరాశ్రయ కుటుంబాల బలవంతపు ఖాళీపై గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సరైన పునరావాస ప్రణాళిక లేకుండానే వేలాది కుటుంబాలను ఖాళీ చేయించడం అమానవీయమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. సంయుక్త జాతీయ నిరాశ్రయుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల్లో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరసనకారులు “పేదలపై దౌర్జన్యాలు ఆపాలి”, “మానవ హక్కులను గౌరవించాలి”, “అక్రమ అరెస్టులు నిలిపివేయాలి”, “నిరాశ్రయులకు నివాసం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలకు మద్దతు తెలిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక కథనాలు వెల్లడిస్తున్నాయి.
Bangkok Pub Fire | విషాదం.. పబ్లో అగ్నిప్రమాదం.. భారీ పేలుడుతో 27 మంది దుర్మరణం
Nepal Gen Z Protests | ప్రభుత్వానికి పెద్ద రాజకీయ పరీక్ష
ఇటీవల ఖాట్మండు పోలీసుల చర్యలకు నిరసనగా ఓ 25 ఏళ్ల యువకుడు ఆత్మాహుతి యత్నానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటన తర్వాత యువతలో ఆగ్రహం మరింత పెరిగినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర (బలేన్) షా ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారాయి. గత ఏడాది యువత ఆధ్వర్యంలో జరిగిన భారీ ఉద్యమాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగగా, మార్పు కోరుకున్న యువత మద్దతుతో బలేన్ షా అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు అదే యువత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే ఖాట్మండు లోయతో పాటు పలు ప్రాంతాల్లో 2,500కు పైగా కుటుంబాల నివాసాలను తొలగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వందలాది కుటుంబాలు తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నప్పటికీ, శాశ్వత పునరావాసం లేకపోవడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
Nepal Gen Z Protests | బలవంతపు చర్యలకు పాల్పడితే ప్రమాదం
ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా అరెస్టయిన కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపకుండా బలవంతపు చర్యలకు పాల్పడితే అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా అదే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శక పాలన, సంక్షేమ నిర్ణయాలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. లేకపోతే యువత ఆగ్రహం మరోసారి రాజకీయ మార్పులకు నాంది పలికే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.