అక్షరటుడే వెబ్డెస్క్: Madurai Bus Accident | తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. చెన్నై నుంచి మార్తాండం వైపు వెళ్తున్న ప్రైవేట్ ఆమ్ని బస్సు, అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ రవాణా సంస్థ (SETC) బస్సును బలంగా ఢీకొట్టింది.
Madurai Bus Accident | ప్రమాద తీవ్రత..
బస్సుల మధ్య జరిగిన ఈ ఢీకొన్న తీవ్రతకు ప్రైవేటు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అంతేకాకుండా, అది పక్కనే ఉన్న బస్ షెల్టర్ను బలంగా ఢీకొట్టగా, ప్రభుత్వ బస్సు రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ దురదృష్టకర ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Madurai Bus Accident | నిద్రమత్తు వల్లేనా?
ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే కొట్టంపట్టి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి, తీవ్రంగా గాయపడిన 42 మందిని మదురై రాజాజీ , మేలూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..
తమిళనాడులోని మదురై ప్రాంతంలో TNSTC బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు.#TamilNadu #Madurai #RoadAccident #BusAccident pic.twitter.com/D6NolZuUnO
— Akshara Today | Telugu News (@aksharatoday) July 13, 2026
ఇది కూడా చదవండి: Road Accident | ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరి మృతి