అక్షరటుడే, వెబ్డెస్క్ : Golconda Bonalu 2026 | హైదరాబాద్ (Hyderabad) నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. నెల రోజుల పాటు సాగే ఆషాఢ బోనాలు గోల్కొండతో గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ బోనాలు నిర్వహిస్తారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రిగారికి అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆమె అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
Golconda Bonalu 2026 | భక్తులతో కోలాహాలం
నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటే గోల్కొండ కోట.. నేడు భక్తులతో కళకళలాడుతోంది. కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు తరలివచ్చారు. తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొట్టెలను పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయానికి తీసుకెళ్లారు. బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Golconda Bonalu 2026 | రూ.11 లక్షలు అందజేత

ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్ లెల్ను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఎల్నినో ప్రభావం తగ్గి, భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద దేవాలయాతో పాటు, చిన్న చిన్న గుడులకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Reaction | పిల్లల మనసుల్లో మతచిచ్చు.. సెక్యులర్ వాదుల మౌనం ఎందుకు..? : బండి సంజయ్