అక్షరటుడే వెబ్డెస్క్: Shravan Maas Puja | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాలలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా, దైవిక శక్తి నిండినదిగా భావిస్తారు. ఈ మాసమంతా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతుంటాయి. శివునికి ( Shiva ) అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
Shravan Maas Puja | శ్రావణ మాస ప్రాముఖ్యత..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసమే శ్రావణ మాసం. ఈ మాసంలో చంద్రుడు శ్రావణ నక్షత్ర సంచారంలో ఉంటాడు. ఈ కాలంలో వర్షాలు కురుస్తూ ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. పరమశివుడు సోమవారాలను ఎంతో ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం భక్తులు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే మంగళవారాల్లో మహిళలు గౌరీ దేవిని, శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవిని పూజిస్తారు.
శివ పూజా విధానం..
శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. శివారాధనకు ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి.
ఉపవాసం , సంకల్పం…
శ్రావణ సోమవారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండటం లేదా అల్పాహారంతో ఉండటం మంచిది. గుడిలో దీపం వెలిగించి శివారాధన చేయాలి.
Shravan Maas Puja | శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకం…
లింగాకారంలో ఉన్న పరమశివునికి అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు), గంగాజలం, కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసే సమయంలో ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించాలి.
అర్చన , నైవేద్యం…
అభిషేకం పూర్తి అయిన తరువాత శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు(మారేడు దళాలు), జిల్లేడు పూలు, తెల్లని పుష్పాలతో అర్చన చేయాలి. భస్మం, చందనం, గంధంతో బొట్లు పెట్టి అలంకరించాలి. అనంతరం పండ్లు, తాంబూలం, పొంగలి లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.
Shravan Maas Puja | శివపురాణ పఠనం…
పూజ ముగిసిన తర్వాత శివాష్టకం, శివ తాండవస్తోత్రం లేదా శ్రావణ సోమవార వ్రత కథను చదువుకోవడం లేదా వినడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. సాయంత్రం వేళ మరోసారి దీపారాధన చేసి, హారతి ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి.
ఈ పవిత్ర మాసంలో భక్తిశ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ, నిష్టతో పూజలు ఆచరిస్తే ఆ పరమశివుని కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా లభిస్తాయి.
ఇది కూడా చదవండి: Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం