NALSAR CJI Controversy | నల్సార్‌లో సీజేఐ ఆహ్వానంపై రగడ.. యాజమాన్యానికి విద్యార్థుల లేఖ 

హైదరాబాద్‌లోని ప్రముఖ నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: NALSAR CJI Controversy | హైదరాబాద్‌లోని ప్రముఖ నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన నీట్ నిరసనల విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయనను స్నాతకోత్సవానికి పిలవవద్దని కోరుతూ 450 మందికి పైగా విద్యార్థులు విశ్వవిద్యాలయ యాజమాన్యానికి లేఖ రాశారు. 2026 బ్యాచ్ స్నాతకోత్సవ తేదీని, అతిథి వివరాలను యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. సీజేఐని ఆహ్వానించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను ఆహ్వానించవద్దంటూ విద్యార్థులు ఒకపూట భోజనం మానేసి నిరసన చేపట్టారు.

NALSAR CJI Controversy | సీజేఐ వ్యాఖ్యలపై వివాదం..

గతంలో జులై 22న నిరసనకారులపై పోలీసుల చర్యలపై సుమోటో విచారణ చేపట్టేందుకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఆ సమయంలో సీజేఐ మాట్లాడుతూ.. “మాకు వీడియోలపై ఆసక్తి లేదు, వాటిని చూసే సమయం లేదు.. మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయొద్దు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాణాల నేపథ్యంలోనే నల్సార్ విద్యార్థులు ఆయనను స్నాతకోత్సవానికి ఆహ్వానించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

NALSAR CJI Controversy | ‘టిస్‌’ వాయిదా తర్వాత మరో ఘటన..

కాగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటనపై వివాదం చెలరేగడం ఇది రెండో విద్యాసంస్థలో జరిగింది. ఈ నెల 2న ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) 86వ స్నాతకోత్సవానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే, విద్యార్థి సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో ఆకస్మికంగా వాయిదా వేశారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇది కూడా చదవండి:  Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్​లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *