అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Metro controversy | “ఖాయా పియా కుచ్ నహి, తోడా గిలాస్ బారహ్ ఆనా” చందంగా.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించడంలో గానీ, దానికి రూపాయి సహాయం చేయడంలో గానీ ఎలాంటి పాత్ర లేని కాంగ్రెస్ ప్రభుత్వం, నిమ్మలంగా నడుస్తున్న ఒక అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆగం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు (MLC) డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy తీసుకుంటున్న అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాల వల్లే ఇవాళ మెట్రో రైల్ ప్రాజెక్టు అతలాకుతలమై, తెలంగాణ Telangana ప్రజలపై వందల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని మండిపడ్డారు.
Kerala teacher suicide | కామారెడ్డిలో కలకలం: పాఠశాల క్వార్టర్స్లో కేరళ ప్రైవేట్ టీచర్ సూసైడ్
Hyderabad Metro controversy | భారీ లూటీ
హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెట్రో రైల్ టేకోవర్, నిధుల లెక్కింపులో జరుగుతున్న భారీ లూటీపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి 25 లోతైన, హేతుబద్ధమైన ప్రశ్నలతో కూడిన నిప్పుల అస్త్రాన్ని సంధించారు. వాటిలో ప్రధానమైన ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి:

Hyderabad Metro controversy | IRFC ఒప్పందం విఫలం.. ఎందుకు?
“మెట్రో ఆదాయం మొదట O&M (నిర్వహణ) ఖర్చులకు వాడాలి, తర్వాతే అప్పు తిరిగి చెల్లించాలి. ఇది దేశంలోని అన్ని మెట్రో సంస్థలు పాటించే విధానం” అని కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మీరు మే 25న IRFCతో ఒప్పందం సంతకం చేసేటప్పుడు MoHUA (కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ) యొక్క ఈ O&M ప్రాధాన్యం వివాదం పరిష్కారం కాలేదని తెలిసి కూడా ఎందుకు సంతకం చేశారు?
O&M ప్రాధాన్యం అనేది MoHUA విధానం అని మే 25కి ముందే తెలిసినప్పటికీ.. మీ ఆర్థిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఈ వివాదం పరిష్కారం కాకముందే ఒప్పందాన్ని ఎలా అనుమతించాయి? దీనికి అంతర్గతంగా ఆమోదం తెలిపింది ఎవరు?
మీరు “అన్ని పూర్వ షరతులు నెరవేర్చాం” అని చెబుతుంటే, కిషన్ రెడ్డి “నెరవేర్చలేదు” అంటున్నారు. ఒకవేళ IRFC అన్ని పూర్వ షరతులు నెరవేరినట్లు నిర్ధారణ పత్రం (Conditions Precedent Satisfaction Certificate) జారీ చేసి ఉంటే, ఆ పత్రాన్ని వెంటనే బహిరంగపరచండి.
Hyderabad Metro controversy | ₹130 కోట్ల నష్టానికి జవాబుదారీ ఎవరు?
రేవంత్ రెడ్డి గారూ, ఒక్క లెక్క చూడండి. మీరు ఏప్రిల్ 29న L&T అప్పు బాధ్యత తీసుకున్నారు. ఆ అప్పు 8.25% నుంచి 11.5% వరకు అధిక వడ్డీతో నడుస్తోంది. IRFC రుణం వచ్చి ఉంటే అది 4% వడ్డీకి మారి, రోజుకు ₹2.5 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యేది.
కానీ IRFC రుణం రాలేదు.. పాత అధిక వడ్డీ భారం అలాగే సాగుతోంది. 30 రోజుల్లో రీఫైనాన్సింగ్ పూర్తయితే వడ్డీ భారం ₹80 కోట్లతో ఆగేది. కానీ జూన్ 24 నాటికి ఈ నష్టం ₹130 కోట్లు దాటింది! ఇప్పుడు SBICAPS రిపోర్ట్ వచ్చి, కొత్త రుణదాత దొరికే సరికి మరో 6-9 నెలలు పడుతుంది. అంటే మరో ₹450–675 కోట్ల అదనపు వడ్డీ నష్టం వాటిల్లనుంది. ఈ భారీ నష్టానికి మీ ఆర్థిక శాఖ నిర్లక్ష్యం కారణం కాదా? దీనికి ఎవరు జవాబుదారీ?
మే 25న సంతకమైన IRFC ఒప్పందాన్ని సదరు సంస్థ రద్దు చేసిందా? లేదా అది ఇంకా చెల్లుబాటులో ఉందా? ఒకవేళ రద్దయితే ఆ నోటీసు ఎవరికి పంపారు? ₹13,537 కోట్ల భారీ ఒప్పందాన్ని అధికారిక విధివిధానం లేకుండా వదిలేయడం చట్టపరంగా సాధ్యమేనా?

Hyderabad Metro controversy | ₹84.32 కోట్ల అడ్వాన్స్ రుసుము ఏమైంది?
ప్రజల సొమ్ము ₹84.32 కోట్లను IRFCకి అప్ఫ్రంట్ రుసుముగా చెల్లించారు. ఇప్పుడు SBICAPSని నియమించిన తర్వాత IRFC ఒప్పందం వాస్తవంలో రద్దయినట్లే లెక్క. మరి ఈ ₹84.32 కోట్లు ప్రభుత్వానికి వాపస్ వచ్చాయా? రాకపోతే IRFCకి అధికారికంగా డిమాండ్ నోటీసు ఎందుకు పంపలేదు?
MoHUAతో O&M వివాదం తేలకముందే ఈ ₹84.32 కోట్లు చెల్లించాలని ఎవరు నిర్ణయించారు? ఆ నిర్ణయం వెనుక కేబినెట్ అనుమతి ఉందా?
ఒకవేళ ఈ ₹84.32 కోట్లు IRFC వాపస్ ఇవ్వకపోతే, ఈ నష్టాన్ని ఏ బడ్జెట్ హెడ్ కింద చూపిస్తారు? దీనిని ప్రభుత్వ నష్టంగా అసెంబ్లీ ముందు ఉంచుతారా?
జపాన్ సంస్థ అదృశ్యం వెనుక రహస్యమేంటని, అసలు అప్పు తేలకముందే తెలంగాణ ఖజానాను లూటీ చేస్తున్న ఈ అనాలోచిత విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలను ప్రజల ముందు ఎండగడతామని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.