Mallika Hijra Murder | తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి.. కిడ్నాప్ చేసి హ‌త్య చేశార‌నే అనుమానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallika Hijra Murder | అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రిలో చోటుచేసుకున్న హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించడంతో ఇది సాధారణ ప్రమాదమా లేదా పథకం ప్రకారం జరిగిన హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తోటి హిజ్రాలు మాత్రం ఇది స్పష్టంగా హత్యేనని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి (Tadipatri)కి చెందిన మల్లిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వడం విచారణలో కీలకంగా మారింది. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు అనుమానితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Mallika Hijra Murder | కిడ్నాప్ చేసి హత్య‌..

ఇదిలా ఉండగా, నిన్న రాత్రి చల్లవారిపల్లి రైల్వే గేట్ (Railway Gate) సమీపంలోని పట్టాలపై ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం అది మల్లికదేనని నిర్ధారించారు. ఈ పరిణామం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.మల్లిక మృతి వార్త తెలిసిన వెంటనే తోటి హిజ్రాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రత్యర్థి గ్రూపు సభ్యులే ముందస్తు పథకం ప్రకారం మల్లికను కిడ్నాప్ చేసి హత్య చేశారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Mallika Hijra Murder | అన్ని విధాలుగా దర్యాప్తు

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిరీష, సంగీత, రాధ అనే ముగ్గురు హిజ్రాలను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిజ్రా వర్గాల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ ఘటనకు కారణమా? లేక మరే ఇతర కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇది కూడా చదవండి..: Fuel Shortage | పెట్రోల్ – డీజిల్ కొరతపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *