Khammam Incident | ఖమ్మం జిల్లాలో విషాదం.. తండ్రీకూతురు అనుమానాస్పద మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khammam Incident | ఖమ్మం జిల్లా (Khammam District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తండ్రీకూతురు మృతి చెందగా.. ఆయన భార్య, మరో కుమార్తె అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం (Nelakondapalli Mandal) కోనాయిగూడెం గ్రామానికి చెందిన కణతాల రాముకు భార్య రమ్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రాము విలేకరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఖమ్మం నగరం మామిళ్లగూడెంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఆయన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Khammam Incident | రెండు రోజుల క్రితం మృతి

పోలీసులు వచ్చి రాము ఇంట్లో పరిశీలించారు. అప్పటికే రాము, అతడి పెద్ద కుమార్తె దివ్య శ్రీ చనిపోయారు. రాము మృతదేహం కుళ్లిపోవడంతో రెండు రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దివ్యశ్రీ మాత్రం ఆదివారమే చనిపోయి ఉంటుందన్నారు. మరోవైపు వారి పక్కనే భార్య రమ్య అపస్మారక స్థితిలో ఉండగా.. చిన్న కూతురు రితిక తలకు గాయమై పడి ఉంది. వారిద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లో ఏం జరిగింది.. అసలు వాళ్లు ఎలా చనిపోయారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Khammam Incident | భార్యాభర్తల మధ్య గొడవ

భార్యాభార్తల మధ్య శుక్రవారం గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. రమ్య ఆదివారం నీరసంగా కనిపించిందని చెప్పారు. రమ్య భర్త, కూతురును చంపి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజులుగా రాముకు ఎవరు ఫోన్​ చేసినా.. ఆమె లిఫ్ట్ చేసి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పినట్లు సమాచారం. అయితే భర్త, కూతురును చంపి రెండు రోజులుగా మృతదేహాలతో రమ్య ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న కూతురును సైతం చంపేందుకు యత్నించిందని, అనంతరం భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. రమ్య కోలుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Mallika Hijra Murder | తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి.. కిడ్నాప్ చేసి హ‌త్య చేశార‌నే అనుమానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *