అక్షరటుడే, వెబ్డెస్క్: Onion Prices | దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.50 దాటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. చక్కెర కేజీ రూ.70 దాటింది. తాజాగా ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.
ధరలు పెరగడంతో మహారాష్ట్ర (Maharashtra) నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి నగరాలకు రైలు మార్గం ద్వారా ఉల్లిపాయలను రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. టోకు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, మహారాష్ట్రలోని తన బఫర్ నిల్వల (అదనపు నిల్వల) నుండి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలను తరలించేందుకు సోమవారం నుంచి “కాందా ఎక్స్ప్రెస్” (Kanda Express)ను ప్రారంభించింది.
Onion Prices | సరఫరా పెంచడంతో..
జాతీయ సగటు కంటే ధరలు ఎక్కువగా ఉన్న ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి నగరాలకు నాసిక్ నుండి ఈ ప్రత్యేక రైలు ద్వారా ఉల్లిపాయలను రవాణా చేస్తారు. అధిక ధరలు ఉన్న మార్కెట్లలో సరఫరాను పెంచడం, వంటగదిలో అత్యవసరమైన ఈ సరుకు ధరలు మరింత పెరగకుండా నిరోధించడం లక్ష్యమని కేంద్రం తెలిపింది. శనివారం నాటికి ఉల్లిపాయల సగటు చిల్లర ధర కిలోకు సుమారు రూ. 42కి చేరింది. ఢిల్లీలో ఏడాది క్రితం ఉల్లి ధర కిలో రూ.35 ఉండగా.. తాజాగా రూ. 65కి చేరింది. అధిక ధరలు ఉన్న ప్రాంతాలకు బఫర్ నిల్వల నుంచి రైలు ద్వారా ఉల్లిపాయలను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు.
Onion Prices | ఉత్పత్తి తగ్గడంతో..
దేశంలోనే అత్యధికంగా ఉల్లిపాయలను ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో, సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాలు ఆలస్యం కావడంతో ఉల్లిపాయల ఉత్పత్తిలో 5-7 శాతం తగ్గుదల నమోదైనట్లు సమాచారం. దీంతో కేంద్రం బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను పలు రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..: Hospital Fire | ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు శిశువుల మృతి