అక్షరటుడే వెబ్డెస్క్:Nepal Flood Disaster | భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రభుత్వం ఈ విపత్తుపై అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఘోర వరదల వల్ల రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో ఇళ్లు, రహదారులు, వంతెనలు జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వసమయ్యాయి. ఈ విపత్తును ‘హిమాలయన్ సునామీ’గా అభివర్ణించిన నేపాల్, చైనా సరిహద్దుల సమీపంలో కొండచర్యలు విరిగిపడటమే ఈ నష్టానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నట్లు తెలిపింది. ఈ భారీ విలయంలో ఇప్పటివరకు 1,127 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3,900 మంది ఆచూకీ గల్లంతయ్యారు.
Nepal Flood Disaster | పరిహార డిమాండ్..
ప్రపంచంలో పెరుగుతున్న గ్రీన్ హౌజ్ ఉద్గారాలే ఈ విపత్తులకు ప్రధాన కారణమని, ఇందులో భారత్, చైనా, అమెరికా వంటి దేశాల పాత్ర ఉందని నేపాల్ ఆరోపిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న దేశాలకు కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాలు తగిన పరిహారం చెల్లించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ డిమాండ్ చేశారు. ఈ నష్టాన్ని కేవలం మానవతా సంక్షోభంగా కాకుండా, ‘వాతావరణ న్యాయం’ నైతిక బాధ్యతగా భావించి అంతర్జాతీయ దేశాలు స్పందించాలని నేపాల్ వాదిస్తోంది. అయితే, తలసరి ఉద్గారాల పరంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.
Nepal Flood Disaster | ఐరాస వేదికగా గళం..
వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాసం పునర్నిర్మాణ పనుల కోసం ఐక్యరాజ్యసమితి మద్దతుతో నడిచే ‘ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్’ సంస్థకు నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా అభ్యర్థన పంపింది. అంతేకాకుండా, ఈ విపత్తుపై అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వాదనలు వినిపించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా ( Balen Shah )ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Konda Surekha Comments | సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు