అక్షరటుడే వెబ్డెస్క్: Delhi Building Collapse | ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనంలో పీజీ హాస్టల్ నడుపుతుండగా, ఆదివారం కావడంతో విద్యార్థులంతా లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 నుంచి 50 మంది వరకు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
Delhi Building Collapse | ముమ్మరంగా సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 10 మందిని సురక్షితంగా వెలికితీశారు. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద నుంచి విద్యార్థులు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న కొందరు విద్యార్థులు కాపాడాలని ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
Delhi Building Collapse | పర్యవేక్షణ లోపం వల్లే ..
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్కు కూతవేటు దూరంలో ఈ ప్రాంతం ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడ పీజీలలో నివసిస్తుంటారు. అయితే, భవనం కూలడానికి సరిగ్గా ముందు రోజు బేస్మెంట్లో కొన్ని మరమ్మతు పనులు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సత్య నికేతన్ పరిధిలో ఇలాంటి పాత ఇళ్లన్నింటినీ కొందరు హాస్టల్స్గా మార్చి విద్యార్థులకు అద్దెకు ఇస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
#WATCH | Delhi | Satya Niketan PG building collapse | Rescue operation ongoing. NDRF and Fire Department teams at work at the collapse site. pic.twitter.com/I64JVdaCVb
— ANI (@ANI) September 6, 2026
ఇది కూడా చదవండి: Sunnam Cheruvu | సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి : హైడ్రా కమిషనర్