అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Women Protection Laws | మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి భరతలక్ష్మి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ(Department of Women and Child Welfare) ఆధ్వర్యంలో ‘మిషన్ అపరాజిత’ పేరుతో గృహహింస నిరోధక చట్టంపై కలెక్టరేట్లో శనివారం సాయంత్రం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Women Protection Laws | ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని..
ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించబడాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సర్పంచ్లను ఆహ్వానించారు. జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), ఆర్మూర్(Armoor) సెషన్స్ జడ్జి శ్రీదేవి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొని గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు.
గృహహింసకు గురైన బాధిత మహిళల ఇబ్బందులను తెలుసుకుని, వారికి తగిన సహకారం లభించేలా చూస్తామని సాంత్వన కల్పించారు. ఓ బాధితురాలికి ఆధార్ కార్డు లేకపోవడంపై గృహహింస కేసు విషయంలో తగిన న్యాయం పొందడం లేదని తెలపడంతో, కలెక్టర్ అప్పటికప్పుడే స్పందించి తన సమక్షంలోనే ఆన్లైన్లో దరఖాస్తు చేయించడం విశేషం.
Women Protection Laws | చట్టాలపై స్పష్టమైన అవగాహన..
ఈ సందర్భంగా జిల్లా జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ.. గృహ హింస నిరోధక చట్టం ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న హక్కులు, రక్షణ చర్యలు, చట్టపరమైన సహాయం గురించి వివరించారు. కుటుంబంలో జరిగే మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులు కూడా గృహ హింస కిందికే వస్తాయని, ఇలాంటి సందర్భాల్లో మహిళలు భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం (One Stop Centre) సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గృహ హింస నిరోధక చట్టం, పోక్సో చట్టాలపై (POCSO act) అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ పద్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీలత, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్రెడ్డి

