అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad ROB Projects | జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల మంజూరు, నిర్మాణాల కోసం ఎంపీ అర్వింద్ (MP Arvind) చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కృషి ఫలితంగా నిజామాబాద్ జిల్లాలో మరో రెండు ఆర్వోబీలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Nizamabad ROB Projects | ఇందల్వాయి, జానకంపేట్ వద్ద..
నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) మరో రెండు ఆర్వోబీల నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందల్వాయి, జానకంపేట్ గూడ్స్ షెడ్ల వద్ద ఆర్వోబీల నిర్మాణాలను చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను, రైల్వే ఉన్నతాధికారులను కలసి పలుమార్లు విజ్ఞప్తులు అందించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Nizamabad ROB Projects | పది ఆర్వోబీల నిర్మాణాలు పూర్తిచేయడమే లక్ష్యం..
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్ పరిధిలో పది ఆర్వోబీల నిర్మాణాలు పూర్తిచేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని జానకంపేట్–నిజామాబాద్ వద్ద ఎల్సీ 190 ఏ, అలాగే ఇందల్వాయి–సిర్నాపల్లి మధ్య ఎల్సీ 198ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణాలను ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్’ కింద గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. రైల్వే చట్టం-1989లోని సెక్షన్–2, క్లాజ్ (37 ఏ) ప్రకారం లభించిన అధికారాలను వినియోగిస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం చేర్చడం ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయమని ఎంపీ పేర్కొన్నారు.
Nizamabad ROB Projects | తక్షణమే భూసేకరణ..
ఈ నిర్ణయం ద్వారా తక్షణమే భూసేకరణ చేపట్టే అవకాశం కలుగుతుందని, పరిపాలన అనుమతులు త్వరితగతిన లభిస్తాయని ఎంపీ తెలిపారు. భూమి స్వాధీనం ప్రక్రియ వేగవంతం అవుతుందని, టెండర్లు, ప్రాజెక్ట్ అమలు వేగంగా పూర్తవుతుందన్నారు. కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుందని, ముఖ్యంగా ప్రజల భద్రత పెరిగి రైలు–వాహన ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం..: మానాల మోహన్ రెడ్డి

