అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పట్టణంలో పలు చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎంలలో కార్డులు మారుస్తూ మోసం చేస్తున్న ఓ వ్యక్తిని.. షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అలాగే బ్యాటరీలను ఎత్తుకెళ్తున్న ముఠాను సైతం సిబ్బంది వలవేసి పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర(Kamareddy SP) సోమవారం మీడియాకు వివరించారు.
SP Rajesh Chandra | కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్లో..
ఎస్పీ కథనం ప్రకారం.. ఈనెల 7న కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో(ATM Card Fraud) ఎస్బీఐ ఏటీఎం వద్ద తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన గుర్రాల శ్రీనివాస్ డబ్బులు తీసేందుకు వెళ్లాడు. ఏటీఎం వాడకం తెలియక ఇబ్బంది పడుతుండగా, అపరిచిత వ్యక్తి సహాయం చేస్తానని నమ్మించి కార్డు పిన్ నంబర్ తెలుసుకున్నాడు. అసలు కార్డు తీసుకొని నకిలీ కార్డు ఇచ్చి మోసం చేశాడు. తర్వాత బాధితుని ఏటీఎం నుంచి రెండుసార్లు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేలు డ్రా చేశాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.
నిందితుడు భిక్కనూరు(Bhikkanoor) మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది రమేష్గా గుర్తించి అదుపులోకి తీసుకోగా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు 2010 నుంచి ఇప్పటివరకు 36 ఏటీఎం మోసాలకు పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 25, కామారెడ్డిలో 7, మెదక్లో 2, నిర్మల్లో 1 కేసు నమోదైందని వివరించారు. ఏప్రిల్ 28న సాయంత్రం 5 గంటలకు సిరిసిల్ల రోడ్డు ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద ఓ మహిళను బెదిరించి పిన్ తెలుసుకొని, దాడి చేసి కార్డు లాక్కొని రూ.37,000 డ్రా చేశాడన్నారు. ఏటీఎం వద్ద అపరిచితుల సహాయం తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ నంబర్ ఎవరికీ చెప్పవద్దన్నారు. నిందితుని వద్ద నుంచి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
SP Rajesh Chandra | షట్టర్ లిఫ్టింగ్ అంతర్ జిల్లా ముఠా అరెస్ట్
రాత్రి వేళ లిక్కర్ మార్ట్ షట్టర్ తాళాలు పగులగొట్టి చోరీ చేసిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7 న రాత్రి కామారెడ్డి పట్టణంలోని లిక్కర్ మార్ట్లో చోరీ జరిగింది. యజమాని జనగామ శ్రీనివాస్ రాత్రి 10 గంటలకు లిక్కర్ మార్ట్ మూసివేసి వెళ్లగా, ఉదయం 5 గంటలకు వచ్చి చూసేసరికి షట్టర్ తాళాలు విరిగి, అద్దాలు పగిలి క్యాష్ కౌంటర్లోని రూ.50వేలు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి బృందం రంగంలోకి దిగింది. 100కు పైగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ముగ్గురిని గుర్తించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోలో వెళ్తున్న ముగ్గురి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.
పోలీసుల విచారణలో హైదరాబాద్(Hyderabad) నుంచి ఆటోలో వచ్చి పగలు రెక్కీ చేసి, రాత్రి చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితులు కూకట్పల్లిలో ఆటో చోరీ చేసి అదే ఆటోలో కామారెడ్డికి వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. రాత్రి సమయంలో దొంగతనం కోసం అనువైన ప్రదేశం కోసం తిరుగుతుండగా లిక్కర్ మార్ట్ను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. షట్టర్ తాళాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారని, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.50 వేల నగదు తీసుకుని హైదరాబాద్ పారిపోయారని పేర్కొన్నారు. మరొక చోరీ చేయడానికి వచ్చి పోలీసులకు చిక్కారని తెలిపారు. కూకట్ పల్లికి చెందిన షేక్ ఇర్ఫాన్, మహమ్మద్ నూరుద్దీన్, ఒక మైనర్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అఖిల్ అనే మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇర్ఫాన్పై ఫోక్సో కేసు ఉందని, 5 దొంగతనాల కేసులో నిందితుడిని, నూరుద్దీన్పై రెండు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.16,500 నగదు, ఆటో, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
SP Rajesh Chandra | డీసీఎం బ్యాటరీల చోరీ నిందితుడు..
కామారెడ్డి పట్టణంలోని గంజ్ మార్కెట్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ కార్యాలయం తాళం పగులగొట్టి 3 డీసీఎం బ్యాటరీలు చోరీ చేసిన పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 30న రాత్రి గంజ్ మార్కెట్లోని కార్యాలయంలో మాలోత్ రవికుమార్ అనే వ్యక్తి ఉంచిన 3 బ్యాటరీలు చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించడం జరిగిందన్నారు. సోమవారం నిజాంసాగర్ చౌరస్తాలో వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి ఆటోలో బ్యాటరీలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు.
అతడిని విచారించగా గంజ్ మార్కెట్లో బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలిపారు. మద్యం, జల్సాలకు డబ్బు కోసం చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడిని కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన అల్లం శివకుమార్ గా గుర్తించి అతడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇతనిపై గతంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో దాడి, హత్యాయత్నం కేసులు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో మరో హత్యాయత్నం కేసు ఉన్నాయని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్ కుమారుడు

