అక్షరటుడే, వెబ్డెస్క్ : ONGC Share Price |భారతదేశంలో అప్స్ట్రీమ్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిపై రాయల్టీ రేట్లను తగ్గించింది. భారతదేశంలో అప్స్ట్రీమ్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడం, చమురు, గ్యాస్ రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు మంగళవారం భారీగా పెరిగాయి. ఓఎన్జీసీ షేరు ధర క్రితం ముగింపు రూ. 281తో పోలిస్తే ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 19.90 పెరిగింది. చివరికి 4.80 శాతం లాభంతో రూ. 294.50 వద్ద స్థిరపడింది. ఆయిల్ ఇండియా షేరు ధర మంగళవారం ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 43.40 పెరిగి ఇంట్రాడేలో రూ. 499.40ని టచ్ చేసింది. చివరికి 7.66 శాతం లాభంతో రూ. 490.95 వద్ద ముగిసింది.
ONGC Share Price | రాయల్టీ లెక్కలు ఇలా..
దేశవ్యాప్తంగా ఉన్న సహజ వనరుల నుంచి చమురు, గ్యాస్ను బయటకు తీసినందుకు ఆయా కంపెనీలు ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తీర ప్రాంతాల్లో ముడి చమురు ఉత్పత్తిపై 16.66 శాతంగా ఉన్న రాయల్టీని కేంద్రం 10 శాతానికి తగ్గించింది. సముద్ర గర్భంలో చేసే ఉత్పత్తిపై 9.09 శాతంనుంచి 8 శాతానికి తగ్గింది. దీనివల్ల కంపెనీ ఖర్చులు తగ్గి, నికర లాభాలు పెరుగనున్నాయి. ఈ మార్పులు అప్స్ట్రీమ్ కంపెనీల లాభాలను, నగదు ప్రవాహాన్ని గణనీయంగా పెంచుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం రాయల్టీ తగ్గించిన తర్వాత ఆయా కంపెనీల షేర్ల టార్గెట్ను బ్రోకరేజీ సంస్థలు పెంచాయి. దీంతో రెండు కంపెనీలూ ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే.. రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి

