అక్షరటుడే, వెబ్డెస్క్ : AIADMK Rebel MLAs | తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో వచ్చిన చీలకితో ద్రావిడ రాజకీయాలు హీటెక్కాయి.
తమిళనాడు అసెంబ్లీలో బుధవారం విజయ్ (Vijay) ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టీవీకే (TVK) ప్రభుత్వానికి మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇందులో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. వారిపై తాజాగా పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ పదవుల నుంచి ఆ ఎమ్మెల్యేలను తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి (EPS) ప్రకటన విడుదల చేశారు. వీరిలో ఎమ్మెల్యేలు ఎస్.పి.వేలుమణి, సి.వి.షణ్ముగం, సి. విజయభాస్కర్ సహా 25 మంది ఉన్నారు.
AIADMK Rebel MLAs | అంతర్గత సంక్షోభం
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. దీంతో షణ్ముగం నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ మేరకు విజయ్కు మద్దతు తెలిపారు. దీంతో పార్టీలో అంతర్గత సంక్షోభం మొదలైంది. వారిని పదవుల నుంచి తొలగించడంతో అది మరింత తీవ్రం అయింది. ఈ కీలక మార్పులలో భాగంగా నాథం విశ్వనాథన్ను AIADMK ఉప ప్రధాన కార్యదర్శి దిండిగల్ తూర్పు జిల్లా కార్యదర్శి పదవుల నుండి తొలగించగా, సి.వి. షణ్ముగం తన ఆర్గనైజింగ్ కార్యదర్శి, విల్లుపురం జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించారు.
AIADMK Rebel MLAs | కొత్తవారి నియామకం
తొలగించిన తిరుగుబాటు నాయకుల స్థానంలో కొత్త జిల్లా కార్యదర్శులను, పార్టీ కార్యకర్తలను పళని స్వామి నియమించారు. కాగా పళనిస్వామిపై షణ్ముగం విమర్శలు చేశారు. ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓటములు పెరిగాయన్నారు. ప్రతి ఎన్నికలోనూ పార్టీకి ఎదురుదెబ్బలు మరింత తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్.. ఓఎస్డీ నియామకం రద్దు

