అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Work From Home | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్లో కూడా ముందస్తు జాగ్రత్తలపై చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఇంధన పొదుపు పిలుపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) స్పందించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో విస్తృతంగా అమలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం.. ఇప్పుడు మళ్లీ ఇంధన సంక్షోభం నేపథ్యంలో తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ (Prime Minister Modi).. పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం భారత్పై కూడా పడే అవకాశముందని హెచ్చరించారు.
AP Work From Home | ఆలోచనా విధానం కూడా మారాలి..
ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అవసరం లేని ప్రయాణాలను నివారించడం, డిజిటల్ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇంటి నుంచే పనిచేసే విధానం మరింత పెరుగుతుందని, అందుకు అనుగుణంగా మన ఆలోచనా విధానం కూడా మారాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం అధికారులందరూ అనవసర ప్రయాణాలను తగ్గించాలని, టెలీ కాన్ఫరెన్స్లు, వీడియో మీటింగ్లను ఎక్కువగా వినియోగించాలని సూచించారు.
AP Work From Home | కొన్ని రోజులు ఇంటి నుంచి
ఇక ఈ ప్రకటనల తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులు కార్యాచరణపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇంటి నుంచే పనిచేయగల విభాగాలను గుర్తించడం, కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఉద్యోగులను వేరు చేయడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.కొన్ని శాఖల్లో పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడం, మరికొన్ని విభాగాల్లో హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయం నుంచి పనిచేసే విధానాన్ని అమలు చేసే అవకాశముంది. ఈ అంశంపై త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో (Cabinet Meeting) చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఉద్యోగుల్లో ఆసక్తి, ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి..: Chandrababu Convoy Reduction | ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదింపు


