అక్షరటుడే, వెబ్డెస్క్: Hotel Food Prices | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో హోటల్ పరిశ్రమపై పెరుగుతున్న ఖర్చుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో స్టార్ హోటళ్ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (AP Star Hotels Association) ప్రాథమికంగా నిర్ణయించింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి వెల్లడించిన వివరాల ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఒక్కసారిగా రూ.993 పెరగడం హోటల్ రంగానికి పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో హోటళ్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు.
Hotel Food Prices | నిర్వహణ ఖర్చులు భరించలేక..
గ్యాస్ ధరల (Gas prices) పెరుగుదలతో వంట ఖర్చులు గణనీయంగా పెరిగాయని, దీనితో పాటు కూరగాయలు, నూనె, ఇతర అవసరాల ధరలు కూడా పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల నిర్వహణ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హోటల్ పరిశ్రమను నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా, దానిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడటం అత్యవసరమని అసోసియేషన్ పేర్కొంది.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మెనూ ధరలను పెంచే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. త్వరలోనే ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉన్నప్పటికీ, హోటల్ రంగం కొనసాగాలంటే ఇది తప్పనిసరి చర్యగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేం వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం ఇప్పుడు నేరుగా వినియోగదారులపై పడనుండటం స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో భోజన ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Chandrababu Pension Scheme | ఏడాదికి రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే :సీఎం చంద్రబాబు


[…] […]