అక్షరటుడే, భీమ్గల్: Grain Purchase Delay | ధాన్యం కొనుగోలు (paddy procurement) ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (MLA vemula prashanth reddy) మండిపడ్డారు. గురువారం మెండోరా మండలంలోని దూద్గావ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
Grain Purchase Delay | ధాన్యం కేంద్రం నుంచే అధికారులకు ఫోన్..
పదిరోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్నా.. గన్నీ బ్యాగులు (బార్దాన్) లేక, లారీలు రాక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO)తో ఫోన్లో మాట్లాడారు. దూద్గావ్ వంటి పెద్ద గ్రామానికి కేవలం 6వేల సంచులు పంపడం ఏమిటని ప్రశ్నించారు. సుమారు 50 నుండి 60 లారీల ధాన్యం నిల్వ ఉన్నచోట కేవలం 3 లారీలు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే లారీల సంఖ్య పెంచి, సరిపడా బార్దాన్ పంపాలని ఆదేశించారు.
Grain Purchase Delay | తరుగు పేరిట నిలువు దోపిడీ..!
మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ముకుంద, పాల్ది, సిద్ధి రామేశ్వర వంటి రైస్ మిల్లుల్లో క్వింటాల్కు 3 నుండి 4 కిలోల అదనపు తరుగు తీస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 41.5 కిలోలకు బదులు 45.5 కిలోలు నింపడం రైతులను నిలువునా ముంచడమేనన్నారు. అదనంగా ఒక్క కిలో తీసుకున్నా ఊరుకోమని హెచ్చరించారు. కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం 8 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Grain Purchase Delay | మొక్కజొన్న రైతులకూ సంచుల కష్టాలు
మెండోరా(Mendora) మండల కేంద్రంలో మొక్కజొన్న బస్తాలు పేరుకుపోవడం, సుమారు 12వేల గన్నీ బ్యాగుల కొరత ఉండటంపై మార్కెఫెడ్ డీఎం (DM)తోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. మెండోరా గ్రామానికి తక్షణమే 12,000 సంచులు పంపాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు తాను అండగా ఉంటానని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తానని ఈ సందర్భంగా వేముల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్కు కోర్టు సమన్లు


