అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sai Bhageerath Arrest | పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ అలియాస్ భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.
మే 16 రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు వివరించారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Bandi Sai Bhageerath Arrest | కేసు నేపథ్యం
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలైన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8, 2026న పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 684/2026 కింద కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పాటు ఇతర సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి (IO) సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా కేసు తీవ్రతను బట్టి సెక్షన్లను సవరించారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 64 (2)(m), 74, 75 లతో పాటు పొక్సో (POCSO) చట్టం-2012 లోని సెక్షన్ 5 (1) r/w 6 ను ఈ కేసులో అదనంగా చేర్చారు.
Bandi Sai Bhageerath Arrest | ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను కూకట్పల్లి డీసీపీ (DCP) రితిరాజ్కు అప్పగించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని సెక్షన్ 183 BNSS కింద నమోదు చేయించారు.
Bandi Sai Bhageerath Arrest | నాకాబందీ.. ఐటీ కారిడార్లో లొకేషన్ గుర్తింపు
పరారీలో ఉన్న నిందితుడు భగీరథ్ కోసం పోలీసులు కరీంనగర్, ఢిల్లీలతో పాటు అతను తిరిగే పలు ప్రాంతాల్లో, అతనికి తెలిసిన వారి ఇళ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ‘లుకౌట్ సర్క్యులర్’ (Look out Circular) జారీ చేశారు.
ఈ క్రమంలో, నిందితుడు పోలీస్ అకాడమీ సమీపంలో తిరుగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నాకాబందీ నిర్వహించారు. శనివారం (మే 16) రాత్రి 8:15 గంటల సమయంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ వద్ద సైబరాబాద్ SOT (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) నిందితుడిని అదుపులోకి తీసుకుని, పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించింది.
Bandi Sai Bhageerath Arrest | నేరం అంగీకారం – రిమాండ్
పోలీస్ స్టేషన్లో సాక్షుల సమక్షంలో దర్యాప్తు అధికారి నిందితుడిని విచారించగా, తాను నేరానికి పాల్పడినట్లు సాయి భగీరథ్ అంగీకరించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. దీంతో దర్యాప్తు అధికారి అతడిని అధికారికంగా అరెస్టు చేశారు.
అనంతరం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.


