అక్షరటుడే వెబ్డెస్క్: SIR Process Allegations |ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.
SIR Process Allegations | ఓటర్ల జాబితాపై సీఎం వ్యాఖ్యలకు కౌంటర్..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని, అందుకే ఉద్యోగులకు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక వర్గం ఓట్లను కేంద్రం తొలగిస్తోందంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే జరుగుతుందని, ప్రతి పోలింగ్ బూత్కు ప్రధాని మోదీ రారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు (బీఎల్ఏలు) ఉన్నప్పుడు కుట్రలు ఎలా జరుగుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ద్వారా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. అది ఏ గ్రామంలో సాధ్యమో నిరూపించాలని సవాల్ విసిరారు.
SIR Process Allegations|ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ ఫెయిల్..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోకుండా, తన బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేస్తోందని ఆరోపించారు.
SIR Process Allegations|అరకొర రుణమాఫీ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రుణమాఫీని అరకొరగా చేసిందని, రైతు భరోసాను పూర్తిగా అటకెక్కించిందని దుయ్యబట్టారు. మంత్రులు వెంటనే జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఒక్కో యూరియా బస్తాపై కేంద్రం రూ. 2500 సబ్సిడీ ఇస్తోందని, అయినప్పటికీ ఫసల్ బీమా యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇది కూడా చదవండి: Rajinikanth Vijay | ఆయన సీఎం అయితే అసూయ పడేవాడిని.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు


