అక్షరటుడే వెబ్డెస్క్:Rahul Gandhi Remarks|లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పీఎం మోదీ ఒక ‘దేశద్రోహి’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ (RSS) లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ప్రధాని మోదీ అమెరికాకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడానికి ఈ ముగ్గురే ప్రధాన కారణమని, రాబోయే రోజుల్లో దేశంలో ఒక పెద్ద ఆర్థిక తుఫాను రాబోతోందని ఆయన హెచ్చరించారు. అది సామాన్య ప్రజల జీవితాలను రోడ్డున పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi Remarks|అంబానీ ఫండింగ్తోనే మోదీ రాజకీయం..
ఇప్పటికే దేశంలో రెండుసార్లు ఇంధన ధరలు పెరిగాయని, త్వరలోనే మరోసారి పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయన్నారు. ఎన్నికల ముందు ధరలు పెరగవని చెప్పిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు తప్పును ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుంటే.. అంబానీ మాత్రం రష్యా నుండి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేసి, ఇక్కడి పెట్రోల్ను అక్రమంగా విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలా సంపాదించిన భారీ సొమ్ముతోనే నరేంద్ర మోదీకి ఫండింగ్ ఇస్తున్నారని, ఇదే అసలైన నిజమని రాహుల్ పేర్కొన్నారు.
Rahul Gandhi Remarks|ప్రజలకు బుద్ధులు చెబుతూ..
ప్రజలను విదేశాలకు వెళ్లవద్దని, బంగారం కొనవద్దని, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని ప్రధాని మోదీ హితబోధ చేస్తున్నారని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. సామాన్యులకు సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి.. తాను మాత్రం వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక విమానాలలో విదేశీ పర్యటనలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Rahul Gandhi Remarks|రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి..
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా ఖండించింది. దేశ ప్రధానిని ‘దేశద్రోహి’ అనడం అంటే.. ఆయనను ఎన్నుకున్న దేశ ప్రజలందరినీ అవమానించడమేనని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇలాంటి దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు. దేశ ప్రతిష్టను మసకబార్చేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Suryastra Rocket Test | ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్


