అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని ఓ వ్యక్తి ఆగ్రహంతో రాయి విసరగా బస్సు అద్దం పగిలిపోయింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి వద్ద గురువారం చోటు చేసుకుంది.
Bus Stone Attack | కామారెడ్డి బస్టాండ్ నుంచి..
కామారెడ్డి బస్టాండ్ (Kamareddy RTC Busstand) నుంచి బస్సు ఉదయం 9 గంటలకు నిజాంసాగర్(Nizamsagar), పిట్లం ప్రయాణికులతో బయలుదేరింది. దేవునిపల్లి రాగానే భగత్ సింగ్ విగ్రహం వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి అటుగా వచ్చిన బస్సును ఆపాలని చేయి చూపించాడు. అయితే బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండానే ముందుకు తీసుకెళ్లాడు. అప్పటికే రెండు బస్సులు ఆపకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి ఓ రాయి తీసుకుని బస్సుపైకి విసిరాడు. ఆ రాయి నేరుగా బస్సు వెనకాల అద్దానికి తాకడంతో అద్దం పగిలి గాజురవ్వలు ప్రయాణికుల పైకి వెళ్లాయి. దీంతో శివాజీ విగ్రహం వద్ద డ్రైవర్ బస్సును నిలిపేశాడు. రాయి విసిరిన వ్యక్తి బస్సు ఎక్కడానికి వెళ్లగా డ్రైవర్ నిరాకరించి రాయితో ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. జరిగిన విషయాన్ని డ్రైవర్ డిపోకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
Bus Stone Attack | సంఘటనా స్థలానికి పోలీసులు..
బస్సు ఆపకపోవడం వల్లే తాను బస్సు పైకి రాయి విసిరానని, బస్సు అద్దం పగులగొట్టాలని తన ఉద్దేశ్యం కాదని దాడి చేసిన వ్యక్తి తెలిపాడు. బస్సు పైకి రాయి విసరడం తప్పేనని, పగిలిన అద్దం ఖర్చు తాను భరిస్తానని తెలిపాడు. విషయం పోలీసులకు చేరడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు పేర్కొన్నారు. రాయి దాడితో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బస్సును పూర్తిగా నిలిపివేశారు. సుమారు గంటకు పైగా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mega 158 Launch | పవన్ కళ్యాణ్ క్లాప్తో మెగా 158 గ్రాండ్ స్టార్ట్.. మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన లాంచ్ ఈవెంట్!


