అక్షరటుడే, వెబ్డెస్క్ : Auto Sales in India | కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ 1తో మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాయి. మారుతి సుజుకీ (Maruti Suzuki), హ్యుందాయ్, కియా వంటి సంస్థల దేశీయంగా రికార్డు స్థాయిలో సేల్స్ నమోదు చేశాయి. గత నెలలో ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలన్నీ కలిపి 4.5 లక్షల కార్లను తమ దేశీయ డీలర్లకు సరఫరా చేసినట్లు అంచనా.
కాగా గతేడాది ఏప్రిల్లో 3.54 లక్షల వాహనాలను విక్రయించగా.. ఈసారి 27 శాతం అధికంగా సరఫరా కావడం గమనార్హం. జీఎస్టీ, ఆదాయపు పన్ను రేట్లలో కోత, కీలక వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు వాహన పరిశ్రమకు మద్దతుగా నిలిచినట్లు భావిస్తున్నారు.
Auto Sales in India | మారుతి సరికొత్త రికార్డ్ ..
మారుతి సుజుకీ కంపెనీ దేశీయ ఆటో మార్కెట్ లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఏప్రిల్లో దేశీయంగా 1,91,122 యÖనిట్లను విక్రయించింది. ఒక నెలలో దేశీయ విక్రయాలపరంగా కంపెనీకి ఇదే అత్యధికం. ఇంతకుముందు గతేడాది డిసెంబర్ లో విక్రయించిన 1,82,165 యూనిట్లే రికార్డుగా ఉంది. కాగా గతేడాది ఏప్రిల్తో 1,42,053 యూనిట్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చితే అమ్మకాలు 34.54 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం మారుతి వద్ద 1.65 లక్షల బుకింగ్స్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
Auto Sales in India | ఎం అండ్ ఎంలో 8 శాతం..
మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఈ ఏడాది ఏప్రిల్లో దేశీయంగా 56,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 52,330 వాహనాలను అమ్మింది. అంటే గతేడాదితో పోలిస్తే 8 శాతం అమ్మకాలు పెరిగాయి.
Auto Sales in India | టీఎంపీవీలో 30 శాతం వృద్ధి..
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో 45,199 యÖనిట్లు అమ్ముడవగా.. ఈసారి ఏప్రిల్ లో విక్రయాలు 59 వేల యూనిట్లకు చేరాయి.
Auto Sales in India | ఇతర కంపెనీలు..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఏప్రిల్లో 17 శాతం వార్షిక వృద్ధితో దేశీయంగా 51,902 యూనిట్లను విక్రయించింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్లో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
కియా ఇండియా ఏప్రిల్లో 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఏప్రిల్లో 23,623 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 27,286 వాహనాలను అమ్మింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సంస్థ చరిత్రలో ఇవే అత్యధిక అమ్మకాలు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ 21 శాతం వృద్ధితో 24,833 యూనిట్లనుంచి 30,159 యÖనిట్లకు అమ్మకాలను పెంచుకుంది.
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏప్రిల్లో 3 శాతం వృద్ధితో 6,018 వాహనాలను డీలర్లకు పంపించింది.
రెనో ఇండియా గతేడాది 2,602 యూనిట్లు విక్రయించగా.. ఈసారి రెట్టింపు పరిమాణంలో 5,413 యూనిట్లను అమ్మింది.
నిస్సాన్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..: Palk Strait Swim Record | పాక్ జలసంధిని ఈదిన బుడతడు.. ఏడేళ్ల బాలుడి రికార్డు

