అక్షరటుడే, వెబ్డెస్క్: Chidambaram on Modi | ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనల సందర్భంగా తనపై జరిగిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
Chidambaram on Modi | చిదంబరం ప్రశ్నలు..
ప్రధాని మోడీ (PM Modi) తనను, తన దివంగత తల్లిని విమర్శించిన పిల్లలను క్షమించినట్లు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ చిదంబరం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. “ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై, ప్రతిపక్షాలపై సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకరమైన, నీచమైన కామెంట్లతో దాడి చేసే బీజేపీ ట్రోల్స్ను కూడా ప్రధాని మోడీ క్షమించేశారా?” అని ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలపై నిత్యం హేయమైన వ్యాఖ్యలు చేసే బీజేపీ ట్రోల్స్ పట్ల ప్రధాని వైఖరి ఏమిటని చిదంబరం ప్రశ్నించారు.
Chidambaram on Modi | ప్రధాని మోడీ ఏమన్నారంటే?
ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో కొందరు యువతులు తనను, తన దివంగత తల్లిని ఉద్దేశించి అత్యంత అసభ్యకర పదజాలం ఉపయోగించారని ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆ పిల్లల వయసు రీత్యా పొరపాట్లు చేయడం సహజమని, వారిని కోర్టుల చుట్టూ తిప్పడం లేదా శిక్షించడం కంటే ప్రేమతో సరైన మార్గంలో పెట్టడమే మన బాధ్యత అని పేర్కొంటూ తాను వారిని క్షమిస్తున్నట్లు వెల్లడించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్న విమర్శలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఇది కూడా చదవండి..: Kerala Landslides | భారీ వర్షాలతో కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు దుర్మరణం..