అక్షరటుడే వెబ్డెస్క్: Bajaj Group Centenary | భారతదేశపు అత్యంత పురాతన , భారీ పారిశ్రామిక సమూహాలలో ఒకటైన బజాజ్ గ్రూప్, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో నేడు వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1926లో స్వాతంత్య్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ ఐదో దత్తపుత్రుడిగా పేరొందిన జమ్నాలాల్ బజాజ్ వేసిన పునాది నేడు ఒక మహావృక్షమైంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం నుండి నేటి ఆర్థిక వృద్ధి వరకు దేశాభివృద్ధిలో బజాజ్ గ్రూప్ భాగస్వామ్యం వెలకట్టలేనిదని కొనియాడారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇటువంటి అనుభవం ఉన్న సంస్థలు కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఆకాంక్షించారు.
Bajaj Group Centenary | విశ్వసనీయతతో అంతర్జాతీయ స్థాయికి..
ప్రస్తుతం ఆటోమొబైల్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ , ఇంజనీరింగ్ రంగాల్లో విస్తరించిన బజాజ్ గ్రూప్, ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరికి సేవలు అందిస్తోంది. బజాజ్ ఆటో నేడు ప్రపంచంలోనే టాప్-3 టూ వీలర్ కంపెనీలలో ఒకటిగా నిలిచి, 100కు పైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ‘పల్సర్’ వంటి బ్రాండ్లు, కేటీఎం (KTM) వంటి భాగస్వామ్యాల ద్వారా భారతీయ కంపెనీలు ప్రపంచ స్థాయి బ్రాండ్లను సృష్టించగలవని నిరూపించామని ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఇదే తరుణంలో, త్వరలోనే ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు గ్రూప్ ప్రకటించింది.
Bajaj Group Centenary | యువత సాధికారత , సామాజిక బాధ్యత..
వ్యాపారం అంటే కేవలం లాభం మాత్రమే కాదని, అది సమాజ శ్రేయస్సు కోసం ఉండాలని నమ్మిన జమ్నాలాల్ బజాజ్ ఆశయాలను ఈ గ్రూప్ కొనసాగిస్తోంది. ‘బజాజ్ బియాండ్’ అనే సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ద్వారా రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల మంది భారతీయ యువతకు నైపుణ్య శిక్షణ , ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఈ సంస్థ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు 10 మిలియన్ల మందికి పైగా లబ్ధిదారుల జీవితాలను ప్రభావితం చేశాయి. విద్య, శిశు ఆరోగ్యం , మహిళా సాధికారతపై ఈ గ్రూప్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
Bajaj Group Centenary | భవిష్యత్తు లక్ష్యాలు – సాంకేతికత, విలువలు
వచ్చే వంద ఏళ్ల ప్రయాణం సాంకేతికత, యువత కేంద్రంగా సాగుతుందని బజాజ్ గ్రూప్ సారథులు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని కేవలం ఒక ట్రెండ్లా కాకుండా, ఆర్థిక సేవలను సామాన్యులకు మరింత చేరువ చేసే సాధనంగా మలుచుకుంటామని సంజీవ్ బజాజ్ తెలిపారు. విజయం అంటే కేవలం వ్యాపార విస్తరణే కాదని, ఎన్ని జీవితాలను మార్చామనేదే ముఖ్యమని శేఖర్ బజాజ్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ సంగీత ప్రదర్శన , రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ లఘు చిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

