అక్షరటుడే, వెబ్డెస్క్: Bengal Elections | పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ (PM Modi) చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఎంసీ పాలనపై విమర్శలు చేసిన ఆయన.. బెంగాల్లో కమలం వికసిస్తుందన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జనసంఘ్కు బెంగాల్ పుట్టినిల్లు అన్నారు. మమతకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చారని, మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఏం చేయలేదన్నారు. రైతులు, యువత కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టీఎంసీ విధానం అని విరుచుకుపడ్డారు. బీహార్, ఒడిశాలో కమలం వికసించిందని, ఇప్పుడు బెంగాల్ వంతు అన్నారు.
Bengal Elections | ప్రమాణ స్వీకారానికి వస్తా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్యారక్పూర్ (Barrackpore)లో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. మే 4న ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) సీఎం ప్రమాణ స్వీకారానికి తాను హాజరు అవుతానని చెప్పారు. బెంగాల్లో జరిగిన ర్యాలీలు, రోడ్షోల సమయంలో, తాను ఎప్పటికీ మరచిపోలేని హృదయపూర్వక సందేశాలు, చిత్రపటాలు అందుకున్నానని తెలిపారు.
Bengal Elections | గెలుపు ఎవరిదో..
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 77 సీట్లు మాత్రమే సాధించినా.. 38 శాతం ఓట్లను సాధించడం గమనార్హం. టీఎంసీ 48 శాతం ఓట్లతో 215 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాల ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. ఈ 23న జరిగిన తొలి దశ పోలింగ్ రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయింది. 29న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తాము అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది. అంతేగాకుండా టీఎంసీ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో బెంగాల్ ఓటర్లు కాషాయ పార్టీని గెలిపిస్తారా.. మరోసారి దీదీకి జై కొడుతారా చూడాలి.
ఇది కూడా చదవండి..: AAP MPs Join BJP | బీజేపీ గూటికి ఏడుగురు ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

