Bhageerath POCSO Case | బండి భగీరథ్​ కేసు.. 14 మంది​ ఇన్​ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Bhageerath POCSO Case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బండి భగీరథ్​ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో 14 మంది సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ల (Social media influencers)పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బండి భగీరథ్​ ఓ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పేట్​ బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో శనివారం రాత్రి భగీరథ్​ లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని రిమాండ్​కు తరలించారు. అయితే భగీరథ్​కు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పలువురు అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే చార్మినార్​ పోలీసులు కేసు నమోదు చేయగా.. భగీరథ్​కు అనుకూలంగా బాలికను అవమానపరిచేలా వీడియోలు చేసిన సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లపై తాజాగా పేట్​ బషీరాబాద్​ (Pet Basheerabad) పోలీసులు కేసు నమోదు చేశారు.

Bhageerath POCSO Case | డబ్బులు తీసుకొని..

పోక్సో కేసులో బాలిక వివరాలు బయట పెట్టొద్దు. అయితే బండి భగీరథ్​కు అనుకూలంగా పలువురు సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు ఆమె క్యారెక్టర్​ బ్యాడ్​ చేసేలా వీడియోలు చేశారు. ఈ క్రమంలో బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్​ చేశారు. అయితే వీరు డబ్బులు తీసుకొని బండి భగీరథ్​కు అనుకూలంగా వీడియోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందరి కంటెంట్ ఒకేలా ఉండటంతో ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.

Bhageerath POCSO Case | 27 మందిపై ఫిర్యాదు

భగీరథ్​పై ప్రజల్లో సానుభూతి పెరిగేలా పలువురు సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు వీడియోలు చేశారు. పోక్సో కేసు బాధితుల వివరాలను పరోక్షంగా ప్రస్తావించడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 27 మందిపై ఫిర్యాదు అందగా.. ప్రాథమిక ఆధారాలు లభించడంతో 14 మందిపై కేసు పెట్టారు. మిగతావారిపై సైతం చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు బండి భగీరథ్​కు వ్యతిరేకంగా పలువురు పోస్టులు పెట్టారు. ముందస్తు బెయిల్ పిటిషన్​ విచారణ జరిపిన జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో బెయిల్ ఇస్తే జడ్జి భర్తకు బార్​ కౌన్సిల్ ఛైర్మన్​ పదవి వస్తుందని ఆరోపించారు. ఈ పోస్టులపై జడ్జి మాధవి విచారణలో ప్రస్తావించారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్​ చార్మినార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో నిందితులు తాము పెట్టిన పోస్టులను డిలీట్​ చేస్తున్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Bandi Sai Bhageerath Arrest | జ్యుడీషియల్ రిమాండ్‌కు బండి సాయి భగీరథ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *