అక్షరటుడే, వెబ్డెస్క్: CJP Protest | ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, వివిధ ఇతర రాష్ట్రాలలో సీజేపీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. అదుపులోకి తీసుకున్న మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రక్షణ నేర చరిత్ర ఉన్నవారికి వర్తించదని స్పష్టం చేసింది.
నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఢిల్లీలో ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆందోళనకారులపై కేసులు నమోదు అయ్యాయి. నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జీపై చర్యలు తీసుకోవాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
CJP Protest | స్వతంత్ర విచారణ
పోలీసుల దురాగతాల ఆరోపణలు ప్రాథమికంగా నిష్పక్షపాతమైన, స్వతంత్ర విచారణకు ఆస్కారం కల్పిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతమైన, స్వతంత్ర విచారణ జరిగేలా చూడటానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు తమ వాదనను నమోదు చేసుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. హింస జరిగిన ఇతర రాష్ట్రాలు కూడా తమ వాదనను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
CJP Protest | కోర్టు ఉత్తర్వులు
నేర చరిత్ర ఉన్నవారిని మినహా, నిరసనకారులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. నిరసనల సమయంలో అరెస్టు అయిన 18 ఏళ్ల లోపు పిల్లలను, ఎటువంటి నేరచరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని పేర్కొంది. నిరసనకారుల డిజిటల్, వ్యక్తిగత సమాచారం బహిరంగంగా వెల్లడి కాకుండా పోలీసులు చూడాలని పేర్కొంది. అన్ని సీసీటీవీ, డ్రోన్, బాడీ కెమెరా, వైర్లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ కాల్స్ను భద్రపరచాలని ఆదేశించింది. నేర చరిత్ర ఉన్నవారి విషయంలో ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది.
CJP Protest | కొత్త నియమావళి అవసరం
ప్రజాస్వామ్యంలో ఆందోళనలు అనివార్యమని, దేశవ్యాప్తంగా జరిగే ప్రజా ప్రదర్శనలు, నిరసనలపై పోలీసుల స్పందనను నియంత్రించడానికి ఒక స్పష్టమైన ప్రొటోకాల్ అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విద్యార్థులపై బలప్రయోగం జరిగితే కేంద్రం ఆ విషయాన్ని తేలికగా తీసుకోదన్నారు. ఈ ఘటనలో 250 మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని తెలిపారు. నిజం బయటకు తీసుకురావడానికి సరైన విచారణ జరపాలని కోరారు. విద్యార్థులు హింసకు పాల్పడ్డారని తాను నమ్మడం లేదన్నారు. సంఘ విద్రోహ శక్తులు ఆ బృందంలోకి చొరబడి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన డేటాను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత