అక్షరటుడే వెబ్డెస్క్: Delimitation Bill | దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి సున్నితమైన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయకూడదని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ( PM Modi )విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లును బలవంతంగా తీసుకురావొద్దని, దీనిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డీలిమిటేషన్పై ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ నేపథ్యంలో తాజాగా మోడీకి ఖర్గే ఈ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు స్పష్టమైన డిమాండ్లను ఆయన ప్రధాని ముందుంచారు.
Delimitation Bill | కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు..
మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా మూడు డిమాండ్లను ముందుంచారు. ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రాతినిధ్యాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా మరో 25 సంవత్సరాల పాటు యథాతథంగా కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే, రాబోయే 2029 లోక్సభ ఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో అనుసరించిన ఏకపక్ష ధోరణులకు భిన్నంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: CP Sai Chaitanya | సీపీ సాయిచైతన్యకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు