DRDO Missile Technology | క్షిపణుల తయారీలో కేంద్రం కీలక అడుగు

దేశంలో రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: DRDO Missile Technology | దేశంలో రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమలకు బదిలీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ టెక్నాలజీ బదలాయింపు ద్వారా దేశీయంగానే క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన ఈ సాంకేతికతను అర్హత కలిగిన ప్రైవేట్ సంస్థలకు అందించడం ద్వారా ఆయుధాల తయారీ వేగం పుంజుకోనుంది. అయితే, కంపెనీల అర్హత, ధ్రువీకరణ, నియంత్రణ అవసరాలను బట్టి అన్ని ప్రమాణాలు పాటించిన తర్వాతే ఈ టెక్నాలజీ షేరింగ్ ఉంటుందని స్పష్టం చేశారు.

DRDO Missile Technology | స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో కీలకం..

మన దేశంలోనే అధునాతన క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో కీలకం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రక్షణ తయారీ వ్యవస్థ మరింత విస్తరించడమే కాకుండా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), ఇతర సాంకేతిక భాగస్వాములు కూడా క్షిపణుల సరఫరా గొలుసులో భాగమయ్యే అవకాశం లభిస్తుంది.

DRDO Missile Technology | ఆయుధాల లభ్యత వేగవంతం..

ప్రస్తుతం అధునాతన రక్షణ వ్యవస్థల కోసం భారత్ విదేశీ సరఫరాలపై ఆధారపడాల్సి వస్తోంది. డీఆర్‌డీఓ సాంకేతికతను అందించడం ద్వారా ఈ పరిస్థితిని క్రమంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దేశంలోనే క్షిపణి వ్యవస్థలను తయారు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు, ఆయుధాల లభ్యత వేగవంతం అవుతుంది. ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ రంగంలో పోటీతత్వం, సాంకేతిక ఆవిష్కరణలు పెరుగుతాయని, భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఆయుధాలను ఎగుమతి చేసే సామర్థ్యం కూడా భారత్‌కు వస్తుందని అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్​ సన్మానం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *