Fake GO Scam | నార్సింగి పరిధిలో భారీ భూ కుంభకోణం.. నకిలీ జీవోలతో సర్కారు స్థలానికి ఎసరు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fake GO Scam | భాగ్యనగర శివార్లలో మరో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ఏకంగా నకిలీ జీవోలనే (Fake G.O.s) సృష్టించారు. గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన ఈ కుట్రను రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గండిపేట తాసిల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, నార్సింగి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Fake GO Scam | అసలేం జరిగింది?

గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో మొత్తం 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954-55 ఖస్రా పహానీ రికార్డుల ప్రకారం ఈ భూమి ‘సర్కారీ కంచె’ గా నమోదైంది. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలం. అయితే, ఈ భూమిని తమ పేరిట క్రమబద్ధీకరణ (Regularization) చేసినట్లు ముగ్గురు అక్రమార్కులు తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రభుత్వం ఈ భూమిని తమకే కేటాయించిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ జీవోలను సృష్టించి సర్క్యులేట్ చేశారు. ఇంతటితో ఆగకుండా, ఈ తప్పుడు పత్రాల ఆధారంగా హైకోర్టును కూడా ఆశ్రయించి కేసులు వేయడం గమనార్హం.

revenu.1

Fake GO Scam | నకిలీ జీవోలతో ఎవరికి ఎంత కేటాయింపు?

తేదీ 02.12.2025 నాటి జీవో నం. 558 ప్రకారం సర్వే నంబర్ 18/2/1 లోని 1 ఎకరం 20 గుంటల భూమిని కాముని నాగేశ్వరరావు పేరిట క్రమబద్ధీకరించినట్లు చూపించారు. అలాగే, అదే రోజున జారీ అయినట్లు సృష్టించిన జీవో నం. 553 ద్వారా సర్వే నంబర్ 18/1/2 లోని 2 ఎకరాల 02 గుంటల భూమిని నిమ్మల రామస్వామి గౌడ్ పేరిట, జీవో నం. 555 ద్వారా సర్వే నంబర్ 18/1/1 లోని 2 ఎకరాల 02 గుంటల భూమిని నిమ్మల రాజేష్ గౌడ్ పేరిట కేటాయించుకున్నారు. దీనితో పాటు, జీవో నం. 554 ద్వారా సర్వే నంబర్ 18/1/3 లోని 2 ఎకరాల 02 గుంటల స్థలాన్ని నిమ్మల వేణుగోపాల్ గౌడ్ పేరు మీద, చివరగా జీవో నం. 552 ద్వారా సర్వే నంబర్ 18/1/4 లోని మరో 2 ఎకరాల 02 గుంటల ప్రభుత్వ భూమిని గారె ల మంగ పేరిట అక్రమంగా కేటాయించినట్లు నకిలీ పత్రాలను సృష్టించి ప్రచారం చేశారు.

revenu.2

Fake GO Scam | ఆఫీస్ రికార్డుల్లో ఫైళ్లే లేవు..

ఈ వాట్సాప్ సర్క్యులర్లను గమనించిన గండిపేట తాసిల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నకిలీ జీవోల్లో ప్రస్తావించిన తాసిల్దార్ లెటర్ (No.110/MOI/2025) కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ లెటర్ (No.96/RR/CC/2025) కానీ అసలు ప్రభుత్వ రికార్డుల్లోనే లేవని తేలిపోయింది. ప్రభుత్వ భూమిని కాజేసి, వివాదాలు సృష్టించాలనే దురుద్దేశంతోనే ఈ నకిలీ పత్రాలను పుట్టించారని తాసిల్దార్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులను రెవెన్యూ శాఖ కోరింది.

ఇది కూడా చదవండి: KTR Challenge | 20 లక్షల ఇళ్లు కట్టాకే ఓట్లు అడగండి.. పొంగులేటిపై కేటీఆర్ ఫైర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *