అక్షరటుడే వెబ్డెస్క్: Mahesh Kumar Goud | తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి , సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఎందరో త్యాగధనుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని స్మరించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దృఢ సంకల్పం వల్లే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, పేదల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Mahesh Kumar Goud | సీఎం రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలు..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ వరకు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వివరించారు. ఇదే సమయంలో విపక్షాలపై మండిపడుతూ, గత పాలకులు ‘బంగారు తెలంగాణ’ అని చెప్పి వారి కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని విమర్శించారు. లౌకికవాదమే పునాదిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, మిగిలిన రెండున్నర ఏళ్ల కాలంలో తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే బరిలోకి దిగి, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud | రాజకీయ వర్గాల్లో పీసీసీ చీఫ్ వ్యాఖ్యల కలకలం..
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, తెలంగాణలోనూ ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ ప్రచారాలన్నింటికీ పూర్తిగా చెక్ పెట్టేందుకే పీసీసీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారా, లేక సాధారణంగానే అన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana State Formation Day | దేశానికి ఆదర్శంగా తెలంగాణ : మంత్రి పొంగులేటి


