Hyderabad traffic jam | భాగ్యనగరంలో ‘ట్రాఫిక్’ నరకం: గంటల తరబడి స్తంభించిన ఐటీ కారిడార్.. నగరవాసుల విలవిల!

హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది. ముఖ్యంగా మైండ్‌స్పేస్ నుంచి జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాలు చీమల నడకన సాగుతున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad traffic jam | భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఐటీ కారిడార్‌ పరిధిలో మంగళవారం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన ఉద్యోగులు, సాధారణ ప్రజలు రోడ్లపైనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad traffic jam | స్తంభించిన ఐటీ హబ్.. కదలని వాహనాలు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మాదాపూర్ వరకు వాహనాలు అంగుళం కూడా కదలకుండా నిలిచిపోయాయి.

జూబ్లీహిల్స్, నాలెడ్జ్ సిటీ, ఇనార్బిట్ మాల్, ఐకియా (IKEA) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

ప్రతిష్ఠాత్మక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గత గంటకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీని ప్రభావంతో దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది. ముఖ్యంగా మైండ్‌స్పేస్ నుంచి జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాలు చీమల నడకన సాగుతున్నాయి.

Hyderabad traffic jam | ఇతర ప్రాంతాలకూ విస్తరించిన ఎఫెక్ట్

ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని మిగతా కీలక కూడళ్లలోనూ ట్రాఫిక్ కలకలం రేపింది. పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్ (SR Nagar) ప్రధాన రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్యాలయాలు, వ్యాపార సంస్థల సమయం ముగియడం, ఒకేసారి వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

Hyderabad traffic jam | వాహనదారుల ఆవేదన

“ఆఫీస్ అయిపోయి ఇళ్లకు వెళ్దామంటే గంటల తరబడి రోడ్ల పైనే ఉండాల్సి వస్తోంది. కిలోమీటరు దూరం దాటడానికి గంట సమయం పడుతోంది” అని ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, వీలైతే మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *