అక్షరటుడే, వెబ్డెస్క్: Kerala fake study certificates | “ఆ డాక్టర్ నిజంగా ఎంబీబీఎస్ చదివే డాక్టర్ అయ్యారా..?” ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో సంచలనం కాదు. ఇది దేశ విద్యా వ్యవస్థను, నియామక వ్యవస్థను, ప్రభుత్వ పర్యవేక్షణను, విశ్వవిద్యాలయాల విశ్వసనీయతను, లక్షలాది యువత భవిష్యత్తును ప్రశ్నిస్తోంది.
కేరళ Kerala పోలీసులు ఇటీవల ఛేదించిన భారీ నకిలీ డిగ్రీల రాకెట్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దర్యాప్తులో 11 మంది నిందితులు అరెస్టు కావడం.. 22 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన లక్షకు పైగా నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకోవడం.. ఇంజినీరింగ్, వైద్య, నర్సింగ్ వంటి అత్యంత కీలక రంగాల్లోనూ నకిలీ అర్హతలు చలామణి అయినట్లు బయటపడటం దేశ విద్యా వ్యవస్థకు భయానక హెచ్చరికగా మారింది.
Kerala fake study certificates | భ్రష్టు పడుతున్న వ్యవస్థ
ఇది కేవలం ఒక నేర బృందం కథ కాదు. ఇది తమ దేశం, ప్రభుత్వాలు ఇచ్చిన ధ్రువపత్రాలపై ప్రజలు ఉంచుకున్న విశ్వాసం ఎలా చీలిపోతోందో చెప్పే ఘటన. ఒకప్పుడు విద్య అనేది జ్ఞానానికి ప్రతీకగా ఉండేది. ఇప్పుడు కొందరి చేతుల్లో అది ప్రింటర్కు అనుసంధానమైన వ్యాపార నమూనాగా మారిందనే అనుమానాన్ని ఈ ఘటన నిర్ధారిస్తోంది.
వేలాది కుటుంబాలు అప్పులు చేసి పిల్లలను చదివిస్తాయి. ఓ తల్లి తన బంగారం అమ్ముకుంటుంది. ఓ తండ్రి తన జీవిత పొదుపులను పూర్తిగా ఖర్చు చేస్తాడు. తలకు మించి ఫీజులు చెల్లిస్తాడు.
విద్యార్థేమో రాత్రింబవళ్లు తెగ చదివేస్తాడు. ప్రవేశ పరీక్షలు రాస్తాడు. ప్రాజెక్టులు పూర్తి చేస్తాడు. ఇంటర్న్షిప్లు కూడా చేస్తాడు.
అన్నీ అయ్యాక చేతిలో డిగ్రీ పట్టా పట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతాడు.
కానీ, అదే సమయంలో మరొకడు కంప్యూటర్ ఎదుట కూర్చుని, కొన్ని వేల రూపాయలు చెల్లించి, అదే అర్హతను నకిలీ రూపంలో కొనుగోలు చేసి కొలువు అందుకుంటే?
అప్పుడు ఓడిపోయింది ఎవరు?.. ఆ విద్యార్థా?.. అతడి కుటుంబమా?.. లేదా మొత్తం వ్యవస్థనా?.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు మన ప్రభుత్వాలే.

Kerala fake study certificates | ఏమాత్రం తీసిపోకుండా..
దర్యాప్తు వివరాలను పరిశీలిస్తే.. నకిలీ డిగ్రీ పట్టాలు కేవలం కాగితాలుగా రూపొందించలేదు. వాటిపై హోలోగ్రామ్లు ఉన్నాయి.
విశ్వవిద్యాలయ ముద్రలు, నకిలీ సంతకాలు కూడా ఉన్నాయి. అచ్చం అధికారిక పత్రాల మాదిరిగానే కనిపించే అత్యంత నాణ్యంగా రూపొందించారు.
Kerala fake study certificates | అసలు సమస్య ఏమిటంటే…
ఒక సాధారణ ఎంప్లాయర్కి ఏ ధ్రువపత్రం నిజమైనది ఏది? ఏది నకిలీది? అనేది ఎలా తెలుస్తుందన్నదే ప్రధాన సమస్య. ఇంత పెదద్ స్థాయిలో నకిలీలు తయారవుతున్నాయంటే.. వ్యవస్థలోని తనిఖీ విధానాలు ఎంతలా బలహీనంగా ఉన్నాయో ఈ ఘటన బహిర్గతం చేస్తోంది.
దేశంలో ఏటా లక్షలాది మంది సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాస్తున్నారు. మెరిట్ జాబితాల్లో కేవలం కొన్ని మార్కుల తేడాతో వేలాది మంది వెనుకబడుతున్నారు.
అలాంటి సమయంలో నకిలీ అర్హతల వారు మెరిట్ జాబితాలో ముందుండి ఉద్యోగాలు పొందితే అది కేవలం మోసం కాదు. అది నిజాయితీపై దాడి. అంతేకాదు.. అది ప్రతిభపై, రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాన అవకాశాలపై దాడిగానే చెప్పొచ్చు.
ఇక మరో భయంకరం ఏమిటంటే.. నకిలీ ఇంజినీర్ నిర్మించిన వంతెన కూలిపోతే..? నకిలీ ఫార్మసీ మందులు విక్రయిస్తే..? నకిలీ నర్సు ఐసీయూలో విధులు నిర్వహిస్తే..? నకిలీ డాక్టర్ శస్త్రచికిత్స చేస్తే.. అది ఉద్యోగ మోసం అనే స్థాయిని దాటి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
Kerala fake study certificates | విధానపర నిర్ణేతలు ఏమి చేస్తున్నట్లు..?
దేశంలో ప్రతి అంశంపై రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ, విద్యా ధ్రువపత్రాల ధృవీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు?
డిజిటల్ ఇండియా గురించి గొప్పగా మాట్లాడే ప్రభుత్వాలు నకిలీ డిగ్రీలను గుర్తించే జాతీయ స్థాయి ఏకీకృత వ్యవస్థను ఎందుకు పూర్తిగా అమలు చేయలేకపోతున్నాయి?
ఒక పౌరుడి ఆధార్ వివరాలు క్షణాల్లో అందుబాటులోకి వచ్చే దేశంలో ఒక డిగ్రీ నిజమో.. కాదో.. ఎందుకు వెంటనే నిర్ధారించలేకపోతున్నారు?
ఇది సాంకేతిక వైఫల్యమా..? పాలనా వైఫల్యమా..? లేదా నిరాసక్తతా..? లేదంటే ఇలాంటి నేరాల్లో విధానపరమైన నిర్ణేతలే భాగస్వాములవుతున్నారా..? అనే దానికి ప్రభుత్వాలే సమాధానాలు చెప్పాలి.

Kerala fake study certificates | ఏళ్లుగా నకిలీ రాకెట్..
ఈ నకిలీ ధ్రువపత్రాల రాకెట్ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇంతకాలం ఎవరూ గుర్తించలేదా..? లేదా గుర్తించినా పట్టించుకోలేదా..? ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని ఏలిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏమి చేసింది..? అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.
Kerala fake study certificates | ప్రజాస్వామ్య వ్యవస్థకు హెచ్చరిక..
ఒక నకిలీ ధ్రువపత్రం తయారవడానికి కంప్యూటర్ కావాలి. ప్రింటర్, డేటా, కస్టమర్, మధ్యవర్తులు, రవాణా వ్యవస్థ, డబ్బు లావాదేవీలు కావాల్సి ఉంటుంది. ఇన్ని జరిగినా కూడా ఈ నకిలీ బాగోతాన్ని ఎవరూ గమనించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రశంస కాదు.. అది హెచ్చరిక.

Kerala fake study certificates | ఎంత దారుణం..?
- మన దేశంలో చదువుకునే విద్యార్థి నాలుగేళ్లు కష్టపడాలి – నకిలీ డిగ్రీ వ్యాపారి నాలుగు గంటలు చాలు.
- విద్యార్థి పరీక్షా హాల్లో చెమటోడ్చాలి – నకిలీదారుడు ప్రింటర్ దగ్గర కూర్చుంటే సరిపోతుంది.
- విద్యార్థి సబ్జెక్టులు చదవాలి – నకిలీదారుడు ఫాంట్లు నేర్చుకుంటే సరిపోతుంది.
ఇదే పరిస్థితి ఉంటే.. భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు తరగతి గదుల కంటే ప్రింటింగ్ ప్రెస్లతో పోటీ పడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే భారత డిగ్రీల విశ్వసనీయతను ప్రపంచం నిలదీసే ప్రమాదం లేకపోలేదు.
ఎందుకంటే విదేశీ విశ్వవిద్యాలయాలు, నియామక సంస్థలు, వీసా వ్యవస్థలు ఒక వ్యక్తిని మాత్రమే కాదు.. అతను వచ్చిన దేశ విద్యా వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.
ఒకరి మోసం లక్షలాది నిజాయితీపరులపై మాయని మచ్చగా మారగలదు. అందుకే ఈ ఘటనను కేవలం ఒక నేరంగా మాత్రమే చూడలేం. ఇది ఒక సామాజిక న్యాయం అంశం. విద్యా సంస్కరణలు, ఉద్యోగ అవకాశాలు, ప్రజా భద్రత, జాతీయ ప్రతిష్ఠ అంశంగా ప్రతి ఒక్కరు గుర్తించాలి.
ఈ కేసులో లక్షకు పైగా నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరంలో మరింత పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Kerala fake study certificates | ఇప్పుడు ఏం చేస్తారు…?– నిరుద్యోగుల నిలదీత
ఇప్పుడు దేశ నిరుద్యోగులను అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి.. నకిలీ డిగ్రీలు తయారుచేసిన వారిని అరెస్టు చేయడంతో సరిపెడతారా..? లేక ఆ డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి వ్యవస్థను శుభ్రపపర్చుతారా..? అని అడుగుతున్నారు.
నకిలీ సర్టిఫికెట్ను పట్టుకోవడంతోపాటు దాని వల్ల నష్టపోయిన నిజమైన ప్రతిభను గుర్తిస్తారా..? అని నిలదీస్తున్నారు. ఒక నిరుద్యోగ యువకుడి కన్నీరు ఏ గణాంకాల్లోనూ కనిపించదు. ఒక తండ్రి అప్పు బాధ ఏ దర్యాప్తు నివేదికలోనూ పొందుపర్చరు.
ఒక తల్లి అమ్ముకున్న బంగారం విలువ ఏ ఛార్జ్షీట్లోనూ నమోదు కాదు. కానీ, ఆ బాధలన్నీ ఈ నకిలీ డిగ్రీల కట్టల వెనుక దాగి నలిగిపోతున్నాయి.
దేశాన్ని బలహీనపరచేది సరిహద్దుల వద్ద ఉన్న శత్రువులు మాత్రమే కాదు.. పరీక్షలు రాయకుండానే అర్హతలు కొనుగోలు చేసే వ్యవస్థ కూడా. ఇలాంటి నీచులకు కొమ్ముకాసే విధానపర నిర్ణేతలు కూడా అంతే ప్రమాదకరం.
ఈ ఘటనతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా.. విద్యా వ్యవస్థపై దృష్టి సారిస్తాయా.. నిబంధనలు కఠినంగా అమలు చేస్తాయా.. పత్రాలకు కాకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తాయా..? నకిలీ పత్రాలతో కొలువులు పొందిన వారి భరతం పడతాయా..? లేదంటే.. ప్రజలు తిరగబడే వరకు చూస్తారా..? అనేది కేసు దర్యాప్తు తర్వాతే తేలనుంది.
దీనిని కూడా చదవండి : Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!


